నా శత్రువులకు కూడా డబ్బులేస్తున్నారని, అందుకే జగనన్నపై తనకు కోపం వచ్చిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి దగ్గర అసాగో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తున్న బయో ఇథనాల్ యూనిట్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే చంటిబాబు ముఖ్యమంత్రిని ప్రస్తావిస్తూ సంక్షేమ పథకాలపై తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారు.
తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎవరికి పడితే వారికి డబ్బులు వేస్తున్నారని బాధపడ్డానన్నారు. తాము గతంలో ఎవరిపై అయితే పోరాడామో.. వారికి కూడా డబ్బులు వేశారన్నారు. ఆ పార్టీ, ఈ పార్టీ అని లేకుండా డబ్బులు అకౌంట్లలో వేశారన్నారు. తనలాంటి కొత్తవాళ్లకు హాఫ్ నాలెడ్జ్.. అందుకే ఇదంతా చూసి జగనన్న మీద కోపం వచ్చిందన్నారు. ఏం చేస్తాం.. తన శత్రువుకు కూడా డబ్బులు వేస్తున్నారని భావించానన్నారు. తన వెంట ఉండే కార్యకర్తలు కూడా.. ఏంటన్నా ఇది అని తనను అడిగినట్లు చెప్పుకొచ్చారు.
కొంచెం ఇబ్బందే.. కానీ ఈ మధ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓ టాస్క్ ఇచ్చారని.. గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో జనాల్లోకి వెళ్లమన్నారన్నారు. సంక్షేమ పథకాలు ఎంత వరకు జనాల్లోకి వెళ్లాయో పర్యవేక్షించాలని ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎవరికైనా చిన్న, చిన్న సాంకేతిక లోపాల వల్ల ఆగితే సరిచేయమన్నారని.. ఇలా ప్రజల్లో తిరుగుతుంటే రెండు నెలల తర్వాత తన ఆలోచనా విధానం తప్పైందని చెప్పుకొచ్చారు. తమ పార్టీ కార్యకర్తలే కాకుండా మిగిలిన వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని.. లబ్ధిదారులు తమ దగ్గరకు వచ్చి హారతులు ఇచ్చి పూల వర్షం కురిపిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. తమ బాగోగులు చూసింది ఒక్క వైఎస్ జగన్ అని తమతో చెప్పారన్నారు. ముందు ముఖ్యమంత్రి జగన్పై కోపం వచ్చిన మాట వాస్తవమేనని.. తర్వాత ఇదంతా తెలుసుకుని జగన్కు క్షమాపణలు చెబుతున్నాను అన్నారు.
రాబోయే రోజుల్లో కచ్చితంగా గడప గడపకు తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించే దిశగా ప్రయాణిస్తామన్నారు. అప్పుడే ఓట్లు వేసి గెలిపించి ప్రజల రుణం తీర్చుకోవాలన్నారు. ఎంతో మందికి సేవ చేశాననే ఆనందం తనకు ఉందన్నారు ఎమ్మెల్యే చంటిబాబు. ఒకనొక సమయంలో రాజకీయాలు మానేద్దామనుకున్నానని.. జగన్ కబురు పంపి అవకాశం ఇస్తాను రమ్మని తనను పిలిపించారని.. కానీ తాను వెనకడుగు వేశాను.. కానీ ఆ తర్వాత వెళ్లాను అన్నారు. ఎమ్మెల్యే చంటిబాబు ఈ విషయాలన్నీ చెప్పే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా సభ వేదికపైనే ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa