ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సివిల్ తగాదాకు సీఐడీ పోలీసులకు సంబంధం ఏంటి: రఘురామ కృష్ణరాజు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 04, 2022, 11:43 PM

రెండు సెంట్ల స్థల వివాదాన్ని సాకుగా చూపి మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిని పోలీసులు గోడలు దూకి వచ్చి అరెస్టు చేయడం అమానుషం ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. సివిల్ తగాదాకు సీఐడీ పోలీసులకు సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. భూమి స్థల వివాదంపై కోర్టు స్టే ఉన్నప్పటికీ అయ్యన్నను ఎలా అరెస్టు చేస్తారంటూ ప్రశ్నించారు. గతంలో ప్రహరి గోడ కూల్చినప్పుడే వారు కోర్టును ఆశ్రయించగా.. కోర్టు స్టే ఇచ్చిందని గుర్తు చేశారు. గతంలో ప్రభుత్వ సర్వేయర్ ఇచ్చిన కాగితాలు ఉన్నాయని అయ్యన్న కుటుంబం ప్రభుత్వ అధికారులకు చూపించిందన్నారు. అయితే ఆ కాగితాలు ఫోర్జరీవని, ఫోర్జరీ కాగితాలను చూపించడమే కాకుండా, వాటిని వారి దగ్గర పెట్టుకున్నందుకే ఐపీసీ 474 సెక్షన్ కింద అరెస్టు చేసినట్లు పేర్కొనడం దుర్మార్గమన్నారు. ఒకవేళ అదే నిజమని అనుకున్నా తెల్లవారుజామున అరెస్టు చేయడం ఏమిటంటూ ప్రశ్నించారు.


అయ్యన్న పాత్రుడిపై ఇతర కేసులు నమోదు చేయలేక స్థల వివాదంలో ఆయనని అరెస్టు చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్యం చేస్తుందని.. ఇది ఒక చిన్న కేసు అని స్టేషన్ బెయిల్ ఇవ్వకపోతే, కోర్టు అయినా బెయిల్ ఇస్తుందన్నారు. సీఐడీ పోలీసులే ఇటువంటి అక్రమ అరెస్టులు చేస్తున్నారని.. సాధారణ పోలీసులు ఎవరూ ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడడం లేదన్నారు. రాష్ట్రంలో ఈ ఉన్మాద చర్యలు ఇలాగే కొనసాగిస్తే.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ను కూడా అరెస్టు చేసే అవకాశాలు లేకపోలేదన్నారు. తనకు గతంలో బెయిల్ రావడం ఇంకా వారం రోజులు ఆలస్యం జరిగి ఉంటే లోకేష్‌ను అరెస్ట్ చేసే వారన్నా ఖచ్చితమైన సమాచారం తనకు తెలిసిందన్నారు. రాజ్యాంగం స్వేచ్ఛగా బ్రతికే హక్కును కల్పించిందన్న ఆయన.. ప్రజలంతా ఏకమై న్యాయం కోసం కోర్టుల్లో పోరాడాలన్నారు.


ఫోర్జరీ డాక్యుమెంట్ అభియోగం పెట్టినంత మాత్రాన అయ్యన్న పాత్రుడు అక్రమ అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులకు పాల్పడుతున్న పోలీసు అధికారులను కోర్టులు వదిలివేయడం వల్లే ఈ దారుణాలకు తెగబడుతున్నారన్నారు. అక్రమ అరెస్టులు చేస్తున్న పోలీసులపై న్యాయస్థానాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. తనని సీఐడీ పోలీసులు అక్రమ అరెస్టు చేసినప్పుడే కోర్టులు స్పందించి పోలీసులపై చర్యలు తీసుకొని ఉంటే.. ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. పోలీసుల దుర్మార్గాలకు అడ్డుకట్ట వేయకపోతే నారా లోకేష్, నారా చంద్రబాబును కూడా అరెస్టు చేసే అవకాశాలు లేకపోలేదన్నారు. బ్యాక్ బోన్ కమ్యూనిటీ అంటూ బీసీ జపం చేస్తున్న జగన్ ఉత్తరాంధ్రకు చెందిన ఒక బీసీ నాయకుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు.


విశాఖ రుషికొండపై కేవలం మూడు ఎకరాలలోనే గుండు కొట్టిన మాట వాస్తవమేనని ప్రభుత్వ తరుపు లాయర్లు కోర్టుకు విన్నవించారన్నారు రఘురామ కృష్ణరాజు. రుషికొండపై 20 ఎకరాలలో ప్రకృతి విధ్వంసానికి పాల్పడి కేవలం మూడు ఎకరాలలోనే చదును చేసినట్లుగా పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. ఇకనైనా రుషికొండపై జరుగుతున్న విధ్వంసాన్ని ఆపాలన్నారు. రుషికొండపై కొనసాగుతున్న ప్రకృతి విధ్వంసం గురించి.. కోర్టు ఆదేశాలను వివరించేందుకు ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ విభాగానికి సంబంధించిన కేంద్ర మంత్రిని కలుస్తానన్నారు. రుషికొండపై జరిగిన ప్రకృతి విధ్వంసం గురించి మీడియా సమక్షంలో ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ విభాగం అధికారులు వెరిఫై చేయాలని అన్నారు. విశాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండి గతంలో రుషికొండ ఫోటోలు, ప్రస్తుత ఋషికొండ ఫోటోలను ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ విభాగం అధికారులకు అందజేయాలన్నారు. అలాగే కోర్టులకు కూడా నివేదించాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa