ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘ఆగస్టు సంక్షోభం’ గుట్టు విప్పిన వెంకయ్య నాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 04, 2022, 11:48 PM

ఏపీ రాష్ట్ర రాజకీయాలలో సంచలనం ‘ఆగస్టు సంక్షోభం’పై భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గుట్టు విప్పారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలో చోటుచేసుకున్న ‘ఆగస్టు సంక్షోభం’ అప్పట్లో రాజకీయాల్లో ఒక పెను సంచలనం. ఇప్పటికీ ఈ ఎపిసోడ్‌ గుర్తొచ్చినప్పుడల్లా నాటి నాయకులు అనేక విషయాలను చెబుతుంటారు. తాజాగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఈ పరిణామంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు సంక్షోభం కంటే 6 నెలల ముందు జరిగిన ఓ సంఘటన గురించి వివరించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ‘మన గ్రామం’ సహజ ఉత్పత్తుల కేంద్రాన్ని వెంకయ్య నాయుడు సందర్శించారు. అనంతరం అక్కడ నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సమయంలో కొంత మంది మహిళలు వెంకయ్య నాయుడు కాళ్లకు నమస్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.


‘ఓ రోజు ఎన్టీఆర్ నివాసానికి నేను వెళ్లిన సమయంలో ఆయన ఇంట్లో కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో కొంత మంది మహిళలు ఆయన కాళ్లకు నమస్కరించారు. వాళ్లు అలా ఎందుకు నమస్కరించారని నేను ఎన్టీఆర్‌ను అడిగా. నాపై వారికున్న ప్రేమ, అభిమానం అని ఆయన బదులిచ్చారు. అభిమానమా, పిండాకూడా.. అంతా ఒట్టిదేనని నేను చెప్పా. ఆ తర్వాత 6 నెలలకు జరిగిన ఆగస్టు సంక్షోభంలో ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన ఎపిసోడ్‌లో ఆ ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలే ముందున్నారు’ అని వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు. ఆ ఆరుగురు ఎమ్మెల్యేల పేర్లు మాత్రం తాను ఇప్పుడు చెప్పలేనన్నారు.


1984లో ఆగస్టులో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గుండె ఆపరేషన్ కోసం అమెరికా వెళ్లారు. నాడు క్యాబినెట్ మంత్రిగా ఉన్న నాదెండ్ల భాస్కరరావు ఎన్టీఆర్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేసి ముఖ్యమంత్రి అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాడు ఈ ఘట్టం సెను సంచలనం సృష్టించింది. నాటు ఎన్టీఆర్ పదవిని కోల్పోవడ జాతీయ రాజకీయాల్లోనూ సంచలనంగా మారింది.


ఆ తర్వాత 1995 ఆగస్టులో టీడీపీలో మరోసారి సంక్షోభం తలెత్తింది. నాటి వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. నాడు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టీడీపీ ఎమ్మెల్యేలు ఎన్టీఆర్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపేసి, చంద్రబాబు నాయుడిని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa