పోలవరం ప్రాజెక్టుపై ఉమ్మడి అధ్యయనానికి పీపీఏ నిర్ణయించిందని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ అన్నారు. పోలవరం ప్రాజెక్టులపై ప్రాజెక్టు అథారిటీ కమిటీ (పీపీఏ) సమావేశం బుధవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ సమావేశానికి పీపీఏ అధికారులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అధికారులు, ఇంజినీర్లు హాజరయ్యారు.
బుధవారం ఈ సమావేశం ముగిసిన తర్వాత ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. అసలు ప్రాజెక్టుపై ఉమ్మడి అధ్యయనమేమీ ఉండబోదని కూడా ఆయన స్పష్టం చేశారు. విషయంపై తెలంగాణ ప్రభుత్వం తన అభిప్రాయాన్ని చెబితే దానిని పరిశీలిస్తామని మాత్రమే పీపీఏ చెప్పిందని శశిభూషణ్ కుమార్ తెలిపారు. అన్ని రాష్ట్రాలతో చర్చించి ఏకాభిప్రాయానికి రావాలని మాత్రమే పీపీఏ సూచిందన్నారు. ఈ దిశగా ఇప్పటిదాకా రెండు సమావేశాలు జరిగినా ఇంకా ఏకాభిప్రాయం రాలేదన్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఉంటుందని చెప్పారన్నారు. ఇక భూసేకరణపైనా సమావేశంలో చర్చ జరిగిందని ఆయన తెలిపారు.
ప్రాజెక్టు రెండో దశలో మరో 30 నుంచి 40 వేల ఎకరాలను సేకరించాల్సి ఉంటుందని శశిభూషణ్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను సిద్ధం చేసి భూసేకరణ చేపడతామన్నారు. ఈ భేటీలో పోలవరం పనుల లక్ష్యాలు, వనరులపైనే చర్చ జరిగిందన్నారు. అందులో బాగంగా వర్కింగ్ సీజన్ లో పనులకు ప్రణాళిక వేసి వాటిని ఆమోదించామన్నారు.
దిగువ కాఫర్ డ్యాం పనులను జనవరి చివరికంతా పూర్తి చేస్తామని శశిభూషణ్ కుమార్ తెలిపారు. ప్రధాన డ్యాం పనుల ప్రారంభానికి డయాఫ్రమ్ వాల్ ను పరీక్షిస్తామని ఆయన తెలిపారు. 2023 జూన్ నాటికి ప్రధాన డ్యాం పనులను గ్రౌండ్ లెవల్ కు తీసుకువస్తామని చెప్పిన ఆయన... ప్రధాన డ్యాం గ్యాప్ పనులను 2023 డిసెంబర్ కు పూర్తి చేస్తామని తెలిపారు. అయినా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అన్నింటినీ అధ్యయనం చేశాకే అనుమతులు ఇచ్చారని ఆయన తెలిపారు. పీపీఏ కార్యాలయాన్ని రాజమహేంద్రవరానికి తరలించాలని కోరుతున్నారని, నగరంలో ఈ కార్యాలయానికి తగిన భవనాన్ని వెతుకున్నామని ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa