నర్సీపట్నంలో సంతోష్ అనే టీడీపీ కార్యకర్త మూడేళ్ల కిందట తీవ్రంగా గాయపడి మంచం పట్టడానికి కారణమైన అప్పటి ఏఎస్పీ రిషాంత్రెడ్డితోపాటు మిగిలిన పోలీస్ అధికారులపై తక్షణమే కేసు నమోదు చేయాలని తెలుగుదేశం పొలిట్బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2019 సెప్టెంబరు 4న నారా లోకేశ్ నర్సీపట్నం పర్యటన సందర్భంగా రిషాంత్రెడ్డి కొంతమంది టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారన్నారు. ఈ క్రమంలో సంతోష్ అనే కార్యకర్తను పోలీస్ స్టేషన్ మూడో అంతస్థుపైకి తీసుకువెళ్లి తీవ్రంగా కొట్టి చంపేస్తానని ఏఎస్పీ బెదిరించారని, దాంతో భయపడిన సంతోష్ మేడపై నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడని తెలిపారు. ఈ ఘటనపై సంతోష్ తల్లి పద్మావతి నర్సీపట్నం కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే ఏఎస్పీ రిషాంత్రెడ్డి, మరికొంతమంది పోలీస్ అధికారులపై కేసు నమోదు చేయాలని ఆదేశించిందన్నారు. అయినా ఇప్పటివరకూ ఎఫ్ఐఆర్ వేయలేదన్నారు. ఇదే సమయంలో పద్మావతి జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయగా తక్షణమే సంతోష్ కు రూ.రెండు లక్షలు సాయంగా ఇవ్వాలని డీజీపీ, అనకాపల్లి ఎస్పీలను మంగళవారం ఆదేశించినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో డీజీపీ, అనకాపల్లి ఎస్పీలు స్పందించి తక్షణమే కేసు నమోదుచేయాలన్నారు. లేకపోతే తామే హైకోర్టులో ప్రైవేటు కేసు వేస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa