ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇక 15 ఏళ్లు దాటితే తుక్కు కిందకు మార్చాల్సిందే

national |  Suryaa Desk  | Published : Sun, Nov 27, 2022, 04:01 PM

కొత్త వాహన చట్టం త్వరలో అమలులోకి రానున్నది. ఈ  క్రమంలోనే వాహనాలకు సంబంధించి కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. 15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాలన్నింటినీ తుక్కు కింద మార్చేయాల్సిందేని ప్రకటించారు. 15 ఏళ్లు దాటిన వాహనాలేవీ ఇకపై రోడ్లపై కనిపించబోవని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ఫైల్‌పై గురువారమే సంతకం చేసినట్లు వెల్లడించారు. ఇకపై 15 ఏళ్లు దాటిన బస్సులు, ట్రక్కులు, కార్లు తదితర వాహనాలన్నింటినీ తుక్కు కింద మార్చనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. పాతబడిన వాహనాల టైర్లను మాత్రమే రోడ్డు నిర్మాణ పనుల్లో వినియోగిస్తామని, మిగతా భాగమంతా తుక్కు కింద మారుస్తామని నితిన్ గడ్కరీ తెలిపారు.


పాతబడిన వాహనాలను తుక్కుగా మార్చేందుకు జిల్లాకు రెండు, మూడు చొప్పున స్క్రాపింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. శుక్రవారం (నవంబర్ 25) మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ‘ఆగ్రోవిజన్ 2022’ ఎడిషన్ ప్రారంభోత్సవంలో నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాత వాహనాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.


‘ప్రభుత్వానికి చెందిన, ప్రభుత్వ అధీనంలో ఉన్న ఏ వాహనమైనా 15 ఏళ్లు దాటితే తుక్కు కింద మార్చేస్తాం. ఇదే విషయమై రాష్ట్రాలకు కూడా ఆదేశాలు పంపించాం. ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు ఈ ఫైల్‌పై గురువారమే సంతకం చేశాను’ అని నితిన్ గడ్కరీ అన్నారు.


వ్యక్తిగత వాహనాలకూ వర్తిస్తాయా..?


క్రమంగా ప్రైవేట్ వాహనాలకు కూడా ఈ నిబంధనలను వర్తింపజేసే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, కార్లు తదితర వ్యక్తిగత వాహనాల విషయంలో ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల ఆధారంగా గడువు పెంచే (15 ఏళ్ల కంటే ఎక్కువ) అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు.


వాహన కాలుష్యాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో వాహన స్క్రాపేజ్ విధానాన్ని ప్రకటించింది. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో 2, 3 వాహనాల స్క్రాపింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని గడ్కరీ గతంలో చెప్పారు.


2018 అక్టోబర్2లో కేంద్ర ప్రభుత్వం వాహనాల స్క్రాపేజ్ విధానాన్ని ప్రకటించడానికి ముందు, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో 15 ఏళ్ల పెట్రోల్, 10 ఏళ్ల డీజిల్ వాహనాల వాడకంపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 15 ఏళ్లు పైబడిన వాహనాలను బహిరంగ ప్రదేశాల్లో పార్కింగ్ చేయడాన్ని నిషేధిస్తూ 2014లోనే ఉత్తర్వులు జారీ చేసింది. 2021 ఆగస్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఆటోమోటివ్ స్క్రాపేజ్ విధానాన్ని ప్రారంభించారు. దీన్నే ‘వాలంటరీ వెహికల్ ఫ్లీట్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్’ అని కూడా పిలుస్తారు. ఈ రంగంలో దాదాపు రూ. 10,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ఈ పాలసీ ప్రకటన సందర్భంగా ప్రధాని మోదీ చెప్పారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa