ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్ళైన మూడు నెలలకే మహిళా అదృశ్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 05, 2022, 04:57 PM

మూడు నెలల క్రితమే పెళ్లైంది.. ఎంతో హంగు.. ఆర్భాటాలతో వివాహం జరిగింది. ఆలూమగలిద్దరూ నిండు నూరేళ్లు జీవించాలని పెద్దలు ఆశీర్వదించారు. సంసార జీవితంలోకి అడుగుపెట్టిన ఆ దంపతుల సంతోషం ఎంతో కాలం నిలువలేదు. మూణ్ణాళ్ల ముచ్చట తీరకుండానే కలహాల కాపురంగా మారిపోయింది. ఇప్పుడీ పంచాయితీ పోలీస్ స్టేషన్‌కు చేరింది. వివాహిత ఆచూకీ మాత్రం తెలియడం లేదు. వివరాల్లోకి వెళ్తే.... ఏలూరు, రెడ్డిగూడెం మండలం కూనపరాజపర్వ గ్రామానికి చెందిన ఐశ్వర్యకు.. ఆగిరిపల్లి మండలం వట్టిగుడిపాడు గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌తో మూడు నెలల క్రితం వివాహం జరిగింది. వివాహం అనంతరం అదనపు కట్నం కోసం భార్య ఐశ్వర్యను భర్త రాజ్‌కుమార్ తీవ్ర వేధింపులకు గురి చేశాడు. వారం రోజుల క్రితం భర్త కొడుతున్నాడని తల్లిదండ్రులకు ఏడుస్తూ ఐశ్వర్య ఫోన్ చేసి మాట్లాడింది. దీంతో కుమార్తెను చూసేందుకు అల్లుడి ఇంటికి వెళ్లారు. ఐశ్వర్య ఇంట్లో కనిపించకపోవడం.. తల్లిదండ్రులకు ఎటువంటి సమాచారం లేకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. భర్త రాజ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. రాజ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారన్న సమాచారం తెలియడంతో ఒక్కసారిగా నూజివీడు పోలీస్ స్టేషన్‌పై గ్రామస్థులు విరుచుకుపడ్డారు. ఆగ్రహంతో ఉన్న మహిళలకు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో ఎస్సై, సీఐ స్టేషన్ గేట్లు మూసివేశారు. మరోవైపు తమ కూతురు జాడ చెప్పాలంటూ స్టేషన్ ముందు బాధిత కుటుంబ సభ్యులు బైఠాయించారు. దీంతో రాకపోకలు స్తంభించాయి. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులు మోహరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa