వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ బరిలోకి దిగుతారన్న ప్రచారం విస్త్రుతంగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో చెప్పలేరు. 2019 ఎన్నికల తర్వాత కొన్నాళ్లు సైలెంట్ పాలిటిక్స్ నడిచినా.. ఈ మధ్య యాక్టివిటీ బాగా పెరిగింది. జంపింగ్లు మళ్లీ తెరపైకి వస్తున్నారు. దీంతో పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. వేరే జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉన్నా.. కృష్ణా జిల్లా రాజకీయం మాత్రం రంజుగా మారింది. ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గంపై జోరుగా చర్చ జరుగుతోంది. అందుకు కారణమయ్యారు వల్లభనేని వంశీ.
2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో ఎంతో పేరున్న నేతలు కూడా ఓటమిపాలయ్యారు. కానీ.. గన్నవరం నియోజకవర్గంలో మాత్రం వంశీ జగన్ గాలిని తట్టుకొని విజయం సాధించారు. టీడీపీ నుంచి గెలిచిన 23 మందిలో వంశీ ఒకరు. అలాంటి లీడర్.. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్కు మద్దతు ప్రకటించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల మాదిరిగానే.. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీంతో 2024లో వంశీ వైసీపీ తరఫున గన్నవరంలో పోటీ చేస్తారనే డిస్కషన్ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో.. మరి తెలుగుదేశం పార్టీ నుంచి వల్లభనేని వంశీని ఢీకొట్టే నేత ఎవరు అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. వంశీ సైకిల్ దిగాక.. బచ్చుల అర్జునుడుకు గన్నవరం బాధ్యతలు అప్పజెప్పారు. ఆయన కూడా యాక్టివ్గా తిరుగుతున్నారు. కానీ.. ఇటీవల చంద్రబాబు ఏలూరు పర్యటన నేపథ్యంలో.. గన్నవరం టీడీపీలోని వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. బచ్చుల అర్జునుడు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని సీనియర్ నాయకులు అసహనం వ్యక్తం చేశారు. ఇలా చేస్తే.. తామేంటో చూపిస్తామని కూడా వార్నింగ్ ఇచ్చారు. దీంతో గన్నవరం గరం గరంగా మారింది.
ఒకవేళ బచ్చుల అర్జునుడు నిజంగా పోటీలో నిలిచినా.. వల్లభనేని వంశీని తట్టుకొని గెలుస్తారా అనే అనుమానాలు టీడీపీ నాయకుల్లోనే వ్యక్తమవుతున్నాయి. దీంతో చంద్రబాబు కూడా గన్నవరంపై స్పెషల్ ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. వేరే స్ట్రాంగ్ లీడర్ను వంశీకి ప్రత్యర్థిగా ఎన్నికల్లో నిలిపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే.. ఇప్పటివరకు ఎవరి పేరు బయటకు చెప్పడం లేదు. అటు గన్నవరంలోని టీడీపీ నాయకులు కూడా అర్జునుడు వద్దనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఎవరు రంగంలోకి దిగుతారనేది ఆసక్తికరంగా మారింది.
అటు వల్లభనేని వంశీ కూడా తిప్పలు తప్పవు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వంశీ వైసీపీకి మద్దతు ప్రకటించినప్పటి నుంచి.. వర్గ విబేధాలు పెరిగాయి. ఎప్పటినుంచో పార్టీకి అండగా నిలిచిన వారిని కాదని.. వంశీ తన సొంత వర్గానికి మేలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అటు గన్నవరం సీనియర్ నేతలు దుట్టా రామచంద్ర రావు, యార్లగడ్డ వెంకట్రావ్ కూడా వంశీకి సహకరిస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గన్నవరం రాజకీయం హాట్ హాట్గా మారింది. ఎవరు ఎవరికి చెక్ పెడతారో అనే చర్చ జరుగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa