ఈ నెల 25వ తేదీన క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం విజయవాడలో ప్రభుత్వం ప్రత్యేకంగా క్రిస్మస్ విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రైస్తవులందరికీ సీఎం జగన్, మంత్రులు, వైసీపీ నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. దేవుడి దయ వల్లే ఈ రోజు ఈ స్థానంలో ఉన్నామని అభిప్రాయపడ్డారు. దేవుడు ఎంత గొప్పవాడో చాలా మంది తన కంటే చక్కగా చెప్పగలుగుతారని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న వాళ్లు ఇంకా ఒదిగి ఉండాలని.. ప్రజల సేవకులుగా ఉండాల్సి ఉంటుందన్నారు. ప్రజలకు మరింతగా సేవ చేసే అవకాశం రావాలని దేవుడిని కోరుకుంటున్నానని.. వచ్చే ఎన్నికల్లో కూడా గెలుపొంది ముఖ్యమంత్రి కావాలన్న తన ఆకాంక్షను జగన్ మనసులో మాట బయటపెట్టారు. అలాగే ప్రభుత్వం తరపున ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని, అందరికీ సీఎం జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్ రెడ్డి అభినవ శాంతా క్లాజ్ అని ప్రశంసలు కురిపించారు. దేవుడి దీవెనలు జగన్కు అండగా ఉన్నాయని.. ఆయనపై ప్రతిపక్షాల కుట్రలు పని చేయబోవని వ్యాఖ్యానించారు. సీఎం జగన్కు మనమంతా మద్దతుగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, మంత్రులు తానేటి వనిత, జోగి రమేష్, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa