కరోనా గురించి రకరకాల ప్రచారాల నేపథ్యంలో జర్మన్ శాస్త్రవేత్త స్పందించారు. కరోనా మహమ్మారి కథ ముగిసినట్టేనని జర్మనీకి చెందిన ప్రఖ్యాత వైరాలజిస్ట్ క్రిస్టియన్ డ్రోస్టెన్ పేర్కొన్నారు. ఇది ఇప్పుడు ఎండెమిక్ డిసీజ్ దశలోకి వచ్చేసిందన్నారు. ‘‘సార్స్ కోవ్-2 మొదటి ఎండెమిక్ వేవ్ (వ్యాధి ముగింపు దశ)ను ఈ శీతాకాలంలో చూస్తున్నాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. క్రిస్టియన్ డ్రోస్టెన్ బెర్లిన్ చారైట్ యూనివర్సిటీ హాస్పిటల్ లో వైరాలజిస్ట్ గా పనిచేస్తున్నారు. ఈ శీతాకాలం ముగిసిన తర్వాత ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తి మరింత బలపడుతుందన్నారు.
వచ్చే వేసవిలో ఈ వైరస్ ప్రభావం తక్కువేనని డ్రోస్టెన్ అభిప్రాయపడ్డారు. అయితే, స్వల్ప స్థాయి వేవ్ లు ఒకటి రెండు రావడానికి అవకాశం ఉందని జర్మనీ కోవిడ్-19 నిపుణుల కమిటీ సభ్యుడు, ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్ క్రిస్టియన్ కరగిన్నిడిస్ తెలిపారు. ప్రస్తుతం ఈ మహమ్మారి ఉద్ధృత రూపంలో ఉన్నట్టు చెప్పారు. ప్రజల్లో బలమైన ఇమ్యూనిటీ ఏర్పడిందని చెబుతూ, ఐసీయూల్లో చేరేవారు కొద్ది మందే ఉన్నట్టు తెలిపారు. జర్మనీ, ఇతర యూరప్ దేశాల్లో చేపట్టిన టీకాల కార్యక్రమం వల్లే వైరస్ ముగింపు దశకు చేరినట్టు పేర్కొన్నారు.
మన దేశంలోనూ కరోనా ఎండెమిక్ దశకు చేరినట్టు కొందరు నిపుణులు లోగడే అభిప్రాయం తెలిపారు. కరోనా మూడు విడతల్లో దేశంలో మెజారిటీ ప్రజలు వైరస్ బారిన పడడం, కేసుల సంఖ్య లక్షల నుంచి వందల్లోకి పడిపోవడం, టెస్ట్ ల కోసం ప్రజలు రాకపోవడం, మాస్క్ లు తొలగించడం ఇవన్నీ కరోనా బలహీనపడిందనడానికి సంకేతాలే. ఇంతకాలం లాక్ డౌన్ లను అమలు చేసిన చైనా మాత్రం కరోనా తీవ్ర దశను చూస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa