ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. తన వందో టెస్టును మధుర జ్ఞాపకంగా మార్చుకున్నాడు. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాపై ఈ మ్యాచ్ ఆడిన వార్నర్ డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. దాంతో, తమ 100వ టెస్ట్లో సెంచరీ చేసిన రెండో వ్యక్తిగా నిలిచాడు. ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ భారత్ పై తన వందో టెస్టులో డబుల్ సెంచరీ చేశాడు. దక్షిణాఫ్రికాపై చెలరేగి ఆడిన వార్నర్ టెస్టు ఫార్మాట్ లో మూడు సంవత్సరాల సెంచరీ కరవును తీర్చుకున్నాడు. దక్షిణాఫ్రికాపై ద్విశతకం చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. వార్నర్ కెరీర్లో ఇది 25వ శతకం కాగా మూడో డబుల్ సెంచరీ కావడం విశేషం.
తన వందో వన్డే మ్యాచ్ తో పాటు వందో టెస్టులో కూడా శతకం సాధించిన రెండో క్రికెటర్ గానూ వార్నర్ నిలిచాడు. వెస్టిండీస్ మాజీ ఆటగాడు గోర్డన్ గ్రీనిడ్జ్ మొదట ఈ ఘనత సాధించాడు. వార్నర్ డబుల్ సెంచరీ (200) తో సత్తాచాటడంతో దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. ఓవర్ నైట్ స్కోరు 45/1తో మంగళవారం ఆట కొనసాగించిన ఆసీస్ రెండో రోజు చివరకు తొలి ఇన్నింగ్స్ లో 386/3 స్కోరుతో నిలిచింది. ఇప్పటికే 197 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే వార్నర్ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. స్టీవ్ స్మిత్ (85) కూడా రాణించాడు. ప్రస్తుతం ట్రావిస్ హెడ్ (48 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 189 పరుగులకే ఆలౌటైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa