ఎన్టీఆర్ నాడు పేదలకు రూ.30 పెన్షన్ ఇచ్చారని, ఆ తర్వాత తాను అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని రూ.75 చేశానని, అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ పెన్షన్ ను రూ.200కి పెంచాడని, తాను మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక రూ.200గా ఉన్న ఆ పెన్షన్ ను ఐదేళ్లలో రూ.2 వేలు చేశానని చంద్రబాబు వివరించారు. పేదలపై టీడీపీకి ఉన్న ప్రేమకు అదే నిదర్శనమని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.
గుంటూరు వికాస్ నగర్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు హాజరైన టీడీపీ అధినేత చంద్రబాబు పేదలకు చంద్రన్న కానుకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.... ఉయ్యూరు చారిటబుల్ ట్రస్టు ఉదాత్తమైన కార్యక్రమం చేపట్టిందని కొనియాడారు. పేదలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో ఉయ్యూరు శ్రీనివాసరావు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అభినందించారు.
పేదలకు ఆరు రకాల వస్తువులతో కానుక అందించారని వెల్లడించారు. జనవరి 1న ఒక స్ఫూర్తిదాయక కార్యక్రమంతో ఉయ్యూరు ఫౌండేషన్ ముందకొచ్చిందని తెలిపారు. చాలామంది డబ్బులు సంపాదిస్తారని, కానీ శ్రీనివాసరావు లాంటి కొంతమందే ప్రజల కోసం ఖర్చు చేస్తుంటారని ప్రశంసించారు. ఆయన ఐటీ నిపుణుడిగా అమెరికా వెళ్లినా మనసంతా రాష్ట్రంపైనే ఉందని చెప్పారు. బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలోనూ శ్రీనివాసరావు అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నారని చంద్రబాబు వెల్లడించారు.
రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభకాంక్షలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. 2022 సంవత్సరం మొత్తం విధ్వంసాలు, విద్వేషాలతో గడిచిందని అన్నారు. 2023లో అయినా పేదల బాగు దిశగా ఆలోచిస్తారని కోరుకుంటున్నా అని తెలిపారు. పేదవాళ్లకు న్యాయం చేయాలన్న ఆలోచనకు శ్రీకారం చుట్టిన వ్యక్తి నందమూరి తారకరామారావు అని చంద్రబాబు ఉద్ఘాటించారు. పేదల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టిన ఘనత ఎన్టీఆర్ కే చెల్లుతుందని, 1983లో కిలో బియ్యం రూ.2కే ఇచ్చారని, దేశంలో మొదటిసారిగా పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టారని వివరించారు. టీడీపీ పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడే పార్టీ అని తెలిపారు.
"మేము 54 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే, ఇప్పటి ప్రభుత్వం రూ.3 వేలకు పెంచుతామని చెప్పింది. ఒక ఇంట్లో ఎంత మంది అర్హులు ఉన్నా మేం అందరికీ పెన్షన్ ఇస్తే, ఈ ప్రభుత్వం ఇంట్లో ఒకరికే ఇస్తోంది. పేదలు పండుగల చేసుకోవాలంటే ఆర్థిక ఇబ్బందులు అడ్డొస్తాయని భావించి క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా ఇచ్చాం. చంద్రన్న బీమా తెచ్చాం. ఎవరైనా యాక్సిడెంట్ లో చనిపోతే తక్షణమే రూ.5 లక్షలు ఇచ్చే ఏర్పాటు చేశాం. మట్టి ఖర్చులకు రూ.30 వేలు ఇచ్చాం.
టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చుంటే మొదటి నెల నుంచే రూ.3 వేల పెన్షన్ ఇచ్చేవాళ్లం. పెంచుకుంటూ పోతానని మాటలు చెప్పిన ఈ ముఖ్యమంత్రి ధరలు పెంచుకుంటూ పోతున్నాడు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలన్నింటికీ బొక్క పెట్టాడు. ఈసారి టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం... అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇస్తామని సభాముఖంగా చెబుతున్నా" అని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa