ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ దేశానికి మోదీ ఏం చేశారు: నితీశ్ కుమార్

national |  Suryaa Desk  | Published : Sun, Jan 01, 2023, 08:20 PM

ఈ దేశానికి మోదీ ఏం చేశారని బిహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రశ్నించారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీపై  నితీశ్ కుమార్ విరుచుకుపడ్డారు. ఈ దేశానికి మోదీ ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ఇటీవల అమృత ఫడ్నవీస్ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈ దేశానికి ఇద్దరు జాతిపితలు ఉన్నారని అన్నారు. గత కాలపు భారత దేశానికి జాతిపిత మహాత్మా గాంధీ అని, నూతన భారతానికి మోదీ జాతిపిత మోదీ అని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.


ఇక, గతేడాది ఆగస్టులో ఎన్‌డీఏ నుంచి బయటకొచ్చిన నితీశ్ కుమార్.. ఆర్జేడీ, కాంగ్రెస్ సహా వాపక్షాలతో కలిసి మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి బీజేపీపై తీవ్రస్థాయిలో నితీశ్ విరుచుకుపడుతున్నారు. తాజాగా, శనివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశ స్వాతంత్రం కోసం బీజేపీ, ఆరెస్సెస్ ఏం చేశాయని ఆయన నిలదీశారు. స్వాతంత్ర సమరంలో ఆరెస్సెస్ పాత్ర ఏమీ లేదని స్పష్టం చేశారు.


స్వాతంత్ర్య పోరాటంలో తన తండ్రి పాల్గొన్నారని, వలస పాలన అంతమైన తర్వాత తాను పుట్టినప్పటికీ అన్ని విషయాలను ఆయన తనకు చెప్పారని వివరించారు. దేశ చరిత్రలో మహాత్మా గాంధీ పాత్రను మనం మర్చిపోగలమా? అని నితీశ్ ప్రశ్నించారు. ‘‘కొత్త భారత్‌కు కొత్త జాతిపిత’ దేశానికి మీరేం చేశారు? చెప్పుకోదగినదేమైనా చేశారా? భారత దేశం ఎలా ప్రగతి సాధిస్తోంది? కేవలం జరిగింది ఏమిటంటే కొత్త టెక్నాలజీ అభివృద్ధి అయింది.. మీడియాకు స్వేచ్ఛ లేదు.. ప్రతిపక్షాల వ్యాఖ్యలు ప్రసారం అవడం లేదు’’ అని మండిపడ్డారు.


దీనిపై శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నేత సంజయ్ రౌత్ స్పందిస్తూ... అమృత వ్యాఖ్యలతో బీజేపీ ఏకీభవిస్తుందా? అని ప్రశ్నించారు. మహాత్మా గాంధీని ఎవరితోనూ పోల్చలేమని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే విమర్శించారు. ‘‘జాతిపితను ఎవరితోనూ పోల్చలేం... వాళ్ల (బీజేపీ) ‘కొత్త భారత్‌’ కేవలం వారి కొద్ది మంది స్నేహితులు మాత్రమే ధనవంతులయ్యారు.. దేశంలోని మిగతావాళ్లు పేదరికం, ఆకలితో ఉన్నారు.. మనకు ఇలాంటి భారత్ అవసరం లేదు.. వారు కొద్దిమంది ధనిక వ్యాపారవేత్తల కోసం మోదీని జాతి పితగా చేయాలనుకుంటే వారిని తయారు చేయనివ్వండి... అందుకు నేను వారిని అభినందిస్తున్నాను’’ అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు చెందిన మరో సీనియర్ నేత ప్రమోద్ తివారీ సైతం ఈ వాఖ్యలపై ఘాటుగా స్పందించారు. బీజేపీకి ఇద్దరు జాతిపితలు ఉండొచ్చేమో దేశానికి మహాత్మా గాంధీ ఒక్కరే జాతిపిత అని కౌంటర్ ఇచ్చారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa