ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్కు చేదు అనుభవం ఎదురైంది. శనివారం జి.సిగడాం మండలం వెంకయ్యపేటలో నిర్వహించిన ‘గడపగడపకు’ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్.. ‘మీ ఓటు ఎవరికి వేస్తారు?’ అని మహిళలను ప్రశ్నించారు. దీంతో వారు ఎలాంటి తడబాటు లేకుండా ‘‘మా ఓటు సైకిల్ గుర్తుకే’’ అని వారు సమాధానం చెప్పారు. దీంతో నోటమాట లేకుండా పోయింది. తొలుత ఎమ్మెల్యే గ్రామంలోకి అడుగుపెట్టగానే సమస్యలు స్వాగతం పలికాయి. రోడ్లు, కాలువలు నిర్మించాలని, అర్హులైన వారికి ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు మంజూరు చేయాలని గ్రామస్థులు కోరారు. ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలపై ఆరా తీస్తుండగా ‘‘పండగపూట పప్పన్నం తినొద్దా! ఒట్టి బియ్యమే తింటామా? టీడీపీ హయాంలో పండగపూట పప్పుదినుసులు ఇచ్చేవారు’’ అని కొందరు మహిళలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే.. అద్దంకి ఆదెమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు వివరించి ఎవరికి ఓటు వేస్తారని అడిగారు. దీంతో ఆదెమ్మ తాను సైకిల్కు ఓటు వేస్తానని చెప్పారు. ఆమె ఒక్కరే కాదు.. అక్కడే ఉన్న మాత కాంతమ్మ, కొండపల్లి శాంతమ్మలు కూడా సైకిల్ గుర్తుకే ఓటు వేస్తామని చెప్పడంతో ఎమ్మెల్యే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమం అనంతరం పంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్లి వలంటీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇదేనా మీరు ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లిన తీరు. అసలు మీరేం చేస్తున్నారు? కనీసం 50 ఇళ్ల వారికి కూడా అవగాహన కల్పించలేరా? ఇందుకా ప్రభుత్వం మిమ్మల్ని నియమించింది? తీరు మార్చుకోకపోతే వలంటీర్ల బాధ్యతల నుంచి తీసేస్తాం’’ అని హెచ్చరించారు. ‘‘మనం పథకాలు ఇస్తుంటే.. గ్రామస్థుల నోట సైకిల్ అనే మాట రావడం ఏంటి’’ అని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కోసం వలంటీర్లు పనిచేయకపోతే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa