సమాజం మారుతున్న ఇంకా మూఢనమ్మకాలు పోవడం లేదు. అన్నమయ్య జిల్లా రాయచోటి డివిజన్ డీఎస్పీ శ్రీధర్ తెలిపిన వివరాల మేరకు.. తిరుపతి పట్టణానికి చెందిన సయ్యద్ నౌషాద్ (57) అనే వ్యక్తి గత 20 సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో గుర్రంకొండ మండలం బాబా బుడెన్ కొండ అలియాస్ కుక్కరాజు గుట్ట వద్ద ఉన్న మస్తాన్ వల్లీ దర్గాలో ఉన్న బాబా మదార్ ఖాన్ వద్ద సయ్యద్ నౌషాద్ తాయత్తు కట్టించుకున్నాడు. అయితే తన ఆరోగ్యం కుదుట పడక పోగా, మరింతగా అనారోగ్యానికి గురి కావడంతో బాబా మదార్ ఖాన్పై అనుమానం పెంచుకొని ఆయన్ను హతమార్చేందుకు కుట్ర పన్నాడు.
ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీన సయ్యద్ నౌషాద్తో పాటు చిత్తూరుకు చెందిన అంబికా పతి ఆనంద్ (49), చిత్తూరుకు చెందిన అబ్దుల్ (20), చిత్తూరుకు చెందిన వర్ధన్ మురుగన్ (50), చిత్తూరుకు చెందిన పూర్ణచంద్ర (19), అన్నమయ్య జిల్లా గుర్రంకొండకు చెందిన తాహిర్ (19) కలిసి బాబా మదర్ ఖాన్ను హతమార్చేందుకు వెళ్లారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం ఓ పల్లె సమీపంలో మదర్ ఖాన్ను కొడవళ్లతో హతమార్చేందుకు తరుముతుండగా ప్రాణభీతితో అరుస్తూ పరుగులు తీశాడు.
అయితే అదే సమయంలో సమీపంలో పొలాల్లో పని చేస్తున్న రైతులను చూసి హంతకులు అక్కడ నుంచి పారిపోయారు. మదర్ ఖాన్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన గుర్రంకొండ ఎస్సై దిలీప్ విచారణలో భాగంగా ఆదివారం తంబళ్లపల్లె మండలం యడంవారిపల్లె నుంచి కోటకొండకు వెళ్లే దారిలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఏడుగురిని అదుపులోకి తీసుకొని విచారించగా నిజాలు వెలుగు చూశాయన్నారు. ఈ మేరకు నిందితులను అరెస్టు చేసి వాల్మీకిపురం కోర్టుకు తరలించినట్లు రాయచోటి డీఎస్పీ శ్రీధర్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa