ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒకేసారి పుట్టారు...చితిపై ఒకే సారి కాలిపోయారు

national |  Suryaa Desk  | Published : Sun, Jan 15, 2023, 06:45 PM

రాజస్థాన్ రాష్ట్రంలో మనస్సును కలిచివేసే ఘటన చోటు చేసుకొంది. ఇద్దరు తోబుటువులు ఒకేసారి మరణించారు. పుట్టినప్పుడు ఆ సోదరులిద్దరూ  కలిసే పుట్టారు. 26 ఏళ్లుగా ఒకరిని విడిచి మరొకరు లేకుండా బతికారు. ఇప్పుడు విచిత్రమైన పరిస్థితుల్లో ఒకరికొకరు 900 కి.మీ. దూరంలో ఇద్దరూ దాదాపు ఒకేరకంగా మృతి చెందారు. తల్లిదండ్రులకూ ఏ ఒక్కరూ మిగలకుండా పోయారు. పండుగ (సంక్రాంతి తరహాలో రాజస్థాన్‌లో ఉత్తరాయన్ జరుపుకొంటారు) తీవ్ర విషాదం నింపారు. విధి ఆడిన వింత నాటకం లాంటి ఈ ఘటన రాజస్థాన్‌లోని బార్మర్‌లో చోటుచేసుకుంది. కవలల్లో ఒకరు సూరత్‌లోని ఇంటి టెర్రస్ నుంచి ప్రమాదవశాత్తూ జారి పడి మరణించాడు. గంటల వ్యవధిలోనే అతడి కవల సోదరుడు మరణించాడు.


రెండున్నర దశాబ్దాల కిందట ఒకే తల్లి గర్భాన కవలలుగా ఒకేసారి జన్మించిన సుమేర్, సోహన్ సింగ్‌‌ను వారి స్వగ్రామమైన సార్నో క టాలాలో ఒకే చితిపై దహనం చేశారు. కుటుంబసభ్యులు, బంధువుల రోదనల మధ్య గురువారం (జనవరి 12) వారి అంత్యక్రియలు పూర్తయ్యాయి.


సుమేర్ గుజరాత్‌లోని సూరత్ నగరంలో ఓ టెక్స్‌టైల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. సోహన్ జైపూర్‌లో గ్రేడ్ II టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. సోహన్ చిన్నతనం నుంచి బాగా చదివేవాడు. సుమేర్ మాత్రం చదువులో వెనుకబడి ఉండేవాడు. కానీ, సోహన్‌ను బాగా ప్రోత్సహించేవాడు. ఎంతలా అంటే, సోహన్ తన టీచర్ కలను పూర్తి చేసుకునేందుకు.. సూరత్‌లో సుమేర్ కష్టపడి పనిచేస్తున్నాడు. అలా కష్టపడి సంపాదించిన డబ్బును తన సోదరుడి టీచర్ రిక్రూట్‌మెంట్ శిక్షణ, పుస్తకాలు, ఇతర ఖర్చుల కోసం పంపిస్తున్నాడు.


బుధవారం రాత్రి సుమేర్.. సూరత్‌లో తాను నివాసం ఉంటున్న ఇంటి టెర్రస్ పైనుంచి జారిపడి మృతి చెందాడు. ఆ సమయంలో అతడు ఫోన్‌లో మాట్లాడుతూ ఉన్నట్లు స్థానికులు తెలిపారు. సోహన్ తన కవల సోదరుడి మరణవార్త విని ఇంటికి తిరిగొచ్చాడు. అప్పటికి సుమేర్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బంధువులందరూ వస్తున్నారు. సోహన్ తన ఇంటికి 100 మీటర్ల దూరంలో ఉన్న చెరువు నుంచి నీళ్లు తీసుకురావడానికి వెళ్లాడు. ఇక తిరిగి రాలేదు.


సోహన్ ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు.. చివరికి అతడిని చెరువులో గుర్తించారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సుమేర్ మరణవార్త విని మనస్తాపానికి గురై సోహన్ ఆత్మహత్య చేసుకున్నాడేమో అని తొలుత అనుమానించారు. అయితే, అది ప్రమాదమేనని పోలీసులు తేల్చారు. ఎంతో ప్రేమగా ఉండే తోబుట్టువులిద్దరూ గంటల వ్యవధిలో ఒకే తరహాలో మరణించడం గ్రామంలో విషాదం నింపింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa