కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల్లో బాగా పాపులర్ అయిన స్కీమ్ అటల్ పెన్షన్ యోజన. ఈ పథకంలో ఇప్పటికే కోట్లాది మంది చేరారు. భార్యాభర్తలిద్దరూ ఈ స్కీమ్లో చేరొచ్చు. ఇదొక సామాజిక భద్రతా పథకం. వయసు మళ్లిన తర్వాత, రిటైర్మెంట్ తర్వాత ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2015లో ఈ స్కీమ్ను తీసుకొచ్చింది. అంతే కొద్దిరోజుల్లోనే కోట్లాది మంది ఇందులో చేరారు. మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతున్నారు. భారత పౌరులు 18 ఏళ్ల నుంచి 40 సంవత్సరాల వయసున్న వారు ఎవరైనా ఈ పథకంలో చేరేందుకు అర్హులు. వయసు తక్కువగా ఉన్నప్పుడు ఇందులో చేరితే అంత ఎక్కువ లాభం వస్తుంది. 40 ఏళ్ల తర్వాత చేరేందుకు అవకాశం ఉండదు. అటల్ పెన్షన్ యోజనలో భాగంగా కనీసం 20 సంవత్సరాల పాటు కాంట్రిబ్యూషన్ చేయాలి.
సాధారణంగా మనం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అనే దానిని బట్టి 60 ఏళ్ల వయసు నిండిన తర్వాత పెన్షన్ రూపంలో అందుతుంటుంది. ఇది రూ.1000 నుంచి రూ.5000 మధ్య ఉంటుంది. ఇది చాలా చిన్న మొత్తంలో సేవింగ్స్పై ఆధారపడి ఉంటుంది. అంటే ఉదాహరణకు 18 ఏళ్ల వయసులో నెలకు రూ.42 ఇన్వెస్ట్ చేస్తుంటే.. 60 ఏళ్ల వయసు తర్వాత కచ్చితంగా రూ.1000 చొప్పున పెన్షన్ వస్తుంది. నెలకు రూ.42 అంటే రోజుకు రూపాయి కంటే కాస్త ఎక్కువ అంతే. ఇక అదే నెలకు రూ.210 చొప్పున అటల్ పెన్షన్ యోజనలో చేరితే.. 60 ఏళ్లు నిండిన తర్వాత రూ.5000 పెన్షన్ రూపంలో వస్తుంది.
18 ఏళ్ల వయసులో చేరితే ఆ వ్యక్తి 60 ఏళ్లు వచ్చే వరకు అంటే 42 సంవత్సరాల పాటు నెలకు రూ. 210 చెల్లించాలి. దీంతో వయసు మళ్లిన సమయంలో ఆర్థికంగా ప్రభుత్వం నుంచి సహకారం అందుతుంది. నెలకు రూ.210 పొదుపు చేయడం పెద్ద కష్టమేం కాకపోవచ్చు. నెలకు రూ.210 అంటే.. రోజుకు రూ.7 అంతే. ఇక భార్యాభర్తలిద్దరూ కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే నెలకు రూ.420 చొప్పున సేవింగ్స్ చేస్తే.. 60 ఏళ్లు నిండాక మొత్తం నెలకు రూ.10 వేల చొప్పున పెన్షన్ అందుతుంది.
ప్రస్తుతం అన్ని జాతీయ బ్యాంకులు ఈ స్కీమ్ను అందిస్తున్నాయి. ఆయా బ్యాంక్ వెబ్సైట్లకు వెళ్లి కూడా ఈ ఖాతా తెరవొచ్చు. పోస్టాఫీస్లోనూ దీనిని తీసుకోవచ్చు. అవసరమైన సమాచారం నింపడం లేదా వారికి అందించడంతో ప్రక్రియ పూర్తవుతుంది. దీని కోసం ఆధార్ కార్డు, వాలిడేట్ మొబైల్ నంబరు కావాలి.
మీరు నెలకు రూ.5 వేలు పెన్షన్ కావాలనుకుంటే.. ప్రస్తుతం మీ వయసు 18 అనుకుంటే.. 42 సంవత్సరాల పాటు నెలకు రూ.210 చొప్పున కట్టాల్సి ఉంటుంది. 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.5 వేల చొప్పున పెన్షన్ వస్తుంది. ఇక మీ వయసు ప్రస్తుతం 40 అయితే.. 60 సంవత్సరాలు వచ్చే వరకు నెలకు రూ.1454 కట్టాలి. అందుకే చిన్న వయసులోనే చేరితే ఎక్కువ లాభం పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు.
స్కీమ్ మెచ్యూరిటీ తర్వాత.. ఏదైనా ప్రమాదవశాత్తు సంబంధిత వ్యక్తి చనిపోతే.. సంబంధిత నెలనెలా పెన్షన్ జీవిత భాగస్వామికి చెల్లిస్తారు. జీవిత భాగస్వామి కూడా చనిపోతే.. నామినీకి పూర్తి డబ్బు వస్తుంది. ఈ పథకంలో చేరిన వారు ఇన్కంటాక్స్ యాక్ట్ సెక్షన్ 80 సీసీడీ(1బి) కింద రూ.50000 వరకు పన్ను మినహాయింపును పొందొచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa