ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ సర్కార్ సన్నద్దమవుతోంది. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహించాలని భావిస్తోంది. ఈసారి మాత్రం 21 లేదా 22 పనిదినాలు ఉండేలా సమావేశాలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే మరో వాదన కూడా వినిపిస్తోంది. మార్చి 3, 4న విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ నిర్వహించనుండటంతో ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించే ప్రతిపాదనను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని చెబుతున్నారు.
పరిపాలనా రాజధానిపై ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ముఖ్యమంత్రి జగన్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు జీతాలు, పింఛన్, డీఏ బకాయిలు వంటి సమస్యలపైనా ముఖ్యమంత్రి ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ సమావేశాల సమయంలోనే ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ కోటాలో మార్చి 29తో ఏడు స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ స్థానాలకు మార్చి మొదటి లేదా రెండో వారంలో ఎన్నికల ప్రకటన వెలువడనుంది.
అంతేకాదు వైఎస్సార్సీపీలో ఎమ్మెల్సీ పదవుల హడావిడి కనిపిస్తోంది. మార్చి నుంచి మే వరకూ స్థానాలు ఖాళీ ఏర్పడనుండటంతో వైఎస్సార్సీపీ అన్నింటిని దక్కించుకోవాలని అనుకుంటోంది. ఎమ్మెల్యేల కోటాలో వైఎస్సార్సీలో ఐదుగురు, టీడీపీ ఇద్దరి పదవీ కాలం ముగుస్తోంది. ఇటు స్థానిక సంస్థల కోటాలో తొమ్మిది స్థానాలు కూడా ఉన్నాయి.
వైఎస్సార్సీపీ సామాజిక సమీకరణాలతో పాటూ జిల్లాలవారీగా ప్రాధాన్యతా క్రమంలో ఎమ్మెల్సీ పదవులపై కసరత్తు చేస్తోంది. ఈ స్థానాల్లో ఎస్టీతో పాటూ బీసీలు, నియోజకవర్గాల వారీగా ప్రభావం చూపించే కొందరు నేతలకు అవకాశం ఇస్తారంటున్నారు. ఖాళీ అయ్యే స్థానాలకు సంబంధించి వైఎస్సార్సీపీలో ఆశావహుల సంఖ్య కూాడ చాలానే ఉంది. మరి ఎవరికి అవకాశం దక్కుతుందన్నది చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa