వైసీపీ నాయకుల అవినీతి, అక్రమాలకు అడ్డాగా పురపాలక సంఘం మారిందని మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ధ్వజమెత్తారు. పొన్నూరు పట్టణంలోని 23వ వార్డులో ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని శనివారం తెలుగుదేశం పార్టీ నిర్వహించింది. ముఖ్య అతిధిగా హాజరైన నరేంద్రకుమార్ వార్డులో విస్తృతంగా పర్యటించి ప్రజల బాధలను ఆలకించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నరేంద్రకుమార్ మాట్లాడుతూ.... పొన్నూరు పురపాలక సంఘంలో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. పురపాలక సంఘంకు చెందిన ప్రైవేటు కాంట్రాక్టర్ దౌర్జన్యాలు చూస్తుంటే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయన్నారు. ప్రైవేటు కాంట్రాక్టర్కు చెందిన మంచినీటి ట్యాంకర్కు పురపాలక సంఘం ఉద్యోగులను ఎలా నియమిస్తారని అధికారులను ప్రశ్నించారు. మున్సిపల్ కమిషనర్, ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య సహకారంతోనే కాంట్రాక్టర్ సుభాని అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బినామీ పేర్లతో కాంట్రాక్టు నిర్వహించి అధికారులు, వైసీపీ పాలకులు పురపాలక సంఘాన్ని దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. బిల్లులు మార్చడంతోపాటు బిల్లుల్లోని అంకెలను మార్చి మరీ అధికారులు దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. పురపాలక సంఘంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని నరేంద్రకుమార్ డిమాండ్ చేశారు. అలాగే వార్డుల్లో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించాల్సిన అధికారులు సంఘటనా స్థలంలో లేకుండా కాంట్రాక్టర్ల అవినీతికి అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. వార్డుల్లో సమస్యలు తిష్టవేశాయని, వాటిని పరిష్కరించే అధికారులే లేకుండా పోయారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa