మనదేశంలో జనాభా పెరుగుతోందని ఓవైపు ప్రచారం సాగుతుంటే మరోవైపు పిల్లల్ని కనండి అని సిక్కి సర్కార్ నజరానాలు ప్రకటిస్తోంది. ఇద్దరు పిల్లల్ని కంటే ఒక ఇంక్రిమెంట్. ముగ్గురు పిల్లల్ని కంటే రెండు ఇంక్రిమెంట్లు. పుట్టిన శిశువు ఆలనా పాలన చూసుకునేందుకు ఏడాది పాటు ఆయా. ఆ ఆయాకు ప్రభుత్వం నుంచే జీతం. మహిళా ఉద్యోగులకు ఏడాది పాటు మ్యాటర్నటీ సెలవులు. పురుషులకు 30 రోజుల పాటు ప్యాటర్నటీ లీవులు. ఐవీఎఫ్ ద్వారా సంతానం పొందితే 3 లక్షల రూపాయల నజరానా. సిక్కిం ప్రభుత్వం ప్రకటించిన వరాలు ఇవి. రాష్ట్రంలో జనాభాను పెంచుకునేందుకు చేపట్టిన చర్యల్లో భాగం ఈ వరాలు. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే.. ప్రభుత్వ కొలువు దొరకని పరిస్థితి ఉంటే, సిక్కింలో మాత్రం రెండు ఇంక్రిమెంట్లు ఇస్తామని ప్రకటించారు ఆ రాష్ట్ర సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్. దీని వెనుక బలమైన కారణమే ఉంది. సిక్కింలో సంతానోత్పత్తి రేటు సన్నగిల్లింది. జనాభా కుంచించుకుపోతోంది.
‘సంతానోత్పత్తి తగ్గుదల రేటును నిరోధించాల్సిన అవసరం మనపై ఉంది. సిక్కిం సంతానోత్పత్తి రేటు ఇటీవలి సంవత్సరాల్లో దేశంలోనే అత్యల్పంగా ఒక మహిళకు ఒక బిడ్డ చొప్పున నమోదైంది. పిల్లల్ని కనేందుకు ప్రజలను ప్రోత్సహించాలి’ అని సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ అన్నారు.
ఫెర్టిలిటీ రేటును వృద్ధి చేసే చర్యల్లో భాగంగా ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు మాతృత్వపు సెలవులను ఏడాదికి పెంచుతున్నట్లు ‘సిక్కిం క్రాంతికారి మోర్చా’ ప్రభుత్వం 2021 నవంబర్ 14నే ప్రకటించింది. మహిళా ఉద్యోగులు ప్రసవిస్తే ఏడాది పాటు చిన్నారుల బాగోగులను చూసుకునేందుకు ఇంటి వద్ద ఓ ఆయాను కూడా ప్రభుత్వమే నియమిస్తుందని తాజాగా ఓ సమావేశంలో మాట్లాడుతూ సీఎం ప్రేమ్ సింగ్ ప్రకటించారు. ఇందు కోసం 40 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సున్న మహిళలను రాష్ట్ర ప్రభుత్వం రిక్రూట్ చేస్తుందని తెలిపారు. వీరికి నెలకు 10 వేల రూపాయల చొప్పున ప్రభుత్వమే వేతనం చెల్లిస్తుందని, ఉద్యోగులు ఎలాంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని వివరించారు.
మహిళా ఉద్యోగులు ఇద్దరు పిల్లల్ని కంటే ఒక ఇంక్రిమెంట్, ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలకు జన్మనిస్తే.. రెండు ఇంక్రిమెంట్లు ఇవ్వనున్నట్లు సీఎం ప్రేమ్ సింగ్ తెలిపారు. సాధారణ ప్రజలు కూడా ఎక్కువ మంది పిల్లల్ని కంటే.. ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖ తరఫున ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు.
సంతాన లేమితో బాధపడుతున్న వారి కోసం ప్రభుత్వమే ఐవీఎఫ్ సెంటర్లను ఏర్పాటు చేసిందని సిక్కిం సీఎం తెలిపారు. ఐవీఎఫ్ ద్వారా సంతానం పొందిన దంపతులకు రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 38 మంది మహిళలు ఐవీఎఫ్ ద్వారా సాంతానం పొందారని ఆయన తెలిపారు. సిక్కింలో ప్రస్తుత జనాభా 7 లక్షల కంటే తక్కువగా ఉంది. ఇందులో 80 శాతం మంది స్థానికులు ఉన్నారు. ఈ నేపథ్యంలో జనాభాను వృద్ధి చేసుకునేందుకు సిక్కిం ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa