నెల్లూరు జిల్లాలో తనను రాజకీయంగా ఎదగనీయకుండా కొన్ని కుటుంబాలు కుట్రలు చేస్తున్నారని చెబుతున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. తన తమ్ముడిని కాబోయే ఎమ్మెల్యేగా ఎలా పరిచయం చేశారని నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ప్రశ్నించారు.ఇదిలావుంటే నెల్లూరు జిల్లా రాజకీయాలు హాట్ హాట్గా మారాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్యే విభేదాలు బయటపడుతున్నాయి. సొంత పార్టీ నేతలపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అబ్దుల్ అజీజ్ ఎమ్మెల్యే కోటంరెడ్డిపై పై విధంగా సెటైర్లు వేశారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీధర్రెడ్డి తనకు అన్యాయం జరిగిందని మొసలి కన్నీరు కారుస్తున్నారని అజీజ్ ఎద్దేవా చేశారు. ‘మహానటి’ సినిమాలా శ్రీధర్రెడ్డిని పెట్టి ‘మహానటుడు’ అనే సినిమా తీయాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, కాంట్రాక్టర్లకు ఎమ్మెల్యే చేసే సహాయం ఏముంటుందని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఎలాంటి కళ్లాలు వేయకుండా ఆంబోతును వదిలినట్లు ప్రజలపైకి వదిలేశారని అజీజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రీధర్రెడ్డి ఏ పెద్ద రెడ్లను అయితే విమర్శిస్తున్నారో.. వారి కంటే పెద్ద ఇంద్రభవనాలు కడుతున్నారని దుయ్యబట్టారు. కాలుష్యం పేరుతో రైస్ మిల్లర్లపై ఉద్యమం చేసి.. ఇంటికి మూట రాగానే ఉద్యమం ఆపేశారని ఆరోపించారు. కంటి తుడుపు చర్యగా నలుగురు కార్యకర్తలకు సహాయం చేసి.. వందల కోట్లు దోచేశారని తీవ్ర ఆరోపణలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa