బిలాస్పూర్ సెంట్రల్ జైలు నుంచి వచ్చిన లేఖ ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ నవీన్ జిందాల్కు బెదిరింపు లేఖ రావడం కలకలం రేగింది. రూ. 50కోట్లు ఇవ్వాలని, లేదంటే చంపుతానంటూ ఆగంతకుడు అందులో హెచ్చరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ లేఖను ఓ ఖైదీ పంపినట్టు గుర్తించారు. ఛత్తీస్గఢ్లోని పాత్రపాలిలో ఉన్న జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ సంస్థకు జనవరి 18న పోస్టు ద్వారా ఓ లేఖ వచ్చింది. నవీన్ జిందాల్ 48 గంటల్లోగా రూ.50కోట్లు ఇవ్వాలని, లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని లేఖలో పేర్కొన్నాడు. దీంతో జిందాల్ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బిలాస్పుర్ సెంట్రల్ జైలులో ఓ ఖైదీ ఈ లేఖ రాసినట్టు తేల్చారు. దీంతో అతడిపై కేసు నమోదు చేశారు. పుష్పేంద్ర చౌహన్ అనే ఖైదీ లేఖ పంపినట్టు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. రాయ్గఢ్ ఎస్పీ అభిషేక్ మీనా మాట్లాడుతూ.. జనవరి 18న నవీన్ జిందాల్ను బెదిరిస్తూ పాత్రపాలి కంపెనీకి పోస్ట్ ద్వారా వచ్చిన లేఖపై ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని చెప్పారు. బిలాస్పూర్ సెంట్రల్ జైలులో ఉన్న పుష్పేంద్ర చౌహన్ అనే ఖైదీ ఈ లేఖ రాశాడన్నారు. గత మూడు నాలుగేళ్లుగా నిందితుడు జైలులో ఉంటున్నాడని ఎస్పీ తెలిపారు.
నిందితుడికి ఇటువంటి చర్యలు కొత్తకాదని, గతంలోనూ ఒకటి రెండు కేసులు ఇలాంటివి అతడిపై నమోదయ్యాయని పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ గవర్నర్, రాష్ట్రపతిలను కూడా చంపుతానంటూ గతంలో లేఖలు పంపాడని, అతడి మానసిక పరిస్థితి సక్రమంగా లేకపోవడం వల్లే ఇలా చేస్తున్నాడని ఎస్పీ వివరించారు. అయితే, నిందితుడు పేరు తప్ప మిగతా వివరాలను ఎస్పీ వెల్లడించలేదు. ఏం నేరం కింద జైల్లో ఉన్నాడని కూడా చెప్పలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa