టీటీడీ తాాజగా కీలక నిర్ణయం తీసుకొంది. శ్రీవాణి ట్రస్టు దాతలకు ఇచ్చే బ్రేక్ దర్శనం ఫిబ్రవరి నెల కోటా టికెట్లను ఈ నెల 27వ తేదీన ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. ఈ మేరకు బుధవారం టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. రోజుకు 1,000 టికెట్లు చొప్పున విడుదల చేయనుండగా ఇందులో 750 టికెట్లు ఆన్లైన్లో, 250 టికెట్లు కరెంట్ బుకింగ్ ద్వారా జారీ చేయనున్నారు.
గతంలో శ్రీవాణి టికెట్లు రోజుకు 2,000 టికెట్ల చొప్పున జారీ చేసేవారు. అయితే, మరింత ఎక్కువ మంది సామాన్య భక్తులకు దర్శనం కల్పించేందుకు వీలుగా శ్రీవాణి ట్రస్టు దాతలకు ఇచ్చే బ్రేక్ దర్శన టికెట్ల సంఖ్యను టీటీడీ 1,000కి తగ్గించింది. ఇందులో 750 టికెట్లు ఆన్లైన్లో, 250 టికెట్లు ఆఫ్లైన్లో రేణిగుంట విమానాశ్రయంలో జారీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
సూర్య జయంతి సందర్భంగా ఈ నెల 28వ తేదీన తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. శ్రీమలయప్పస్వామి సూర్యప్రభ వాహనం, చిన్నశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, కల్పవృక్షవాహనం, సర్వభూపాల వాహనం, చంద్రప్రభ వాహనాలపై ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారని వెల్లడించారు. రథసప్తమి నేపథ్యంలో ఈ నెల 28న తిరుపతిలోని కౌంటర్లలో సర్వదర్శనం టైమ్స్లాట్ టోకెన్ల జారీ రద్దు చేస్తున్నట్టు చెప్పారు. భక్తులు ఆరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా స్వామివారిని దర్శించుకోవాలని సూచించారు.
వీఐపీ బ్రేక్, ఆర్జిత సేవలు, వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శనాలను కూడా రద్దు చేసినట్లు ఈవో ధర్మారెడ్డి వివరించారు. జనవరి 27, 28 తేదీల్లో వసతి గదుల ముందస్తు బుకింగ్ను కూడా రద్దు చేశారు. వసతి కేటాయింపు కోసం ఈ రెండు రోజులు సీఆర్వో జనరల్ కౌంటర్లు మాత్రమే పనిచేస్తామని పేర్కొన్నారు. ఇక, రోజు వారీ 3.5 లక్షల లడ్డూల తయారీతో పాటు 4 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్గా అందుబాటులో ఉంచుతామని ఈవో వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa