తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ సోమవారం ఏపీ సీఐడీ విచారణకు హాజరుకానున్నారు. గుంటూరులోని సీఐడీ ఆఫీస్లో సోమవారం ఉదయం 10:30 గంటలకు సీఐడీ అధికారులు విజయ్ని విచారించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డిపై ‘భారతి పే’ యాప్ అంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారనే కేసులో విజయ్పై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో మొదట ఈ నెల 27వ తేదీన విచారణకు రావాలని సీఐడీ నోటీసులిచ్చింది.
అయితే ఆరోజున తనకు ఇతర కార్యక్రమాలు ఉండటంతో సీఐడీ విచారణకు హాజరుకాలేనని ఏపీ హైకోర్టులో చింతకాయల విజయ్ పిటిషన్ వేశారు. వాదనలు విన్న న్యాయస్థానం మంగళవారం సీఐడీ విచారణకు హాజరుకావాలంటూ విజయ్ని ఆదేశించింది. అలాగే లాయర్ సమక్షంలో సీఐడీ విచారించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో చింతకాయల విజయ్కు సీఐడీ అధికారులు మరోసారి సీఆర్పీసీ 41ఏ నోటీసులు జారీ చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శివపురంలోని ఆయన ఇంటికి వచ్చి నోటీసులిచ్చారు. విజయ్ ఇంట్లో లేకపోవడంతో ఆయన తల్లి పద్మావతికి నోటీసు అందజేశారు. మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో నమోదైన కేసుకు సంబంధించి ఈ నెల 27న విజయ్ అక్కడ విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు.
గతేడాది సెప్టెంబర్లో ‘భారతీ పే’ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనికి ఐ-టీడీపీయే కారణమంటూ దానికి కో-కన్వీనర్గా ఉన్న విజయ్పై సీఐడీ కేసు నమోదుచేసింది. ఆయనకు 41ఏ నోటీసులివ్వడానికి సీఐడీ అధికారులు గతేడాది అక్టోబరు 1న హైదరాబాద్లోని విజయ్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను బెదిరించారన్న ఆరోపణలు వచ్చాయి. సీఐడీ అధికారుల తీరుపై విజయ్ భార్య డాక్టర్ సువర్ణకుమారి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఈ నేపథ్యంలో మరోసారి విజయ్కు 41ఏ ప్రకారం నోటీసులిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa