ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా సమస్యను పరిష్కరించారని.... పాములు పట్టే ఇద్దరికి పద్మ శ్రీ అవార్డు

national |  Suryaa Desk  | Published : Mon, Jan 30, 2023, 11:51 PM

తమిళనాడులోని ఓ మారుమూల గ్రామ గిరిజనులకు పద్మ అవార్డలు వరించాయి. అది ఎలా సాధ్యమైందో మీకు తెలుసా....విషపూరితమైన సర్పాలను పడుతూ సమాజానికి సేవలు చేస్తున్న తమిళనాడులోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఇద్దరు గిరిజనులను భారత ప్రభుత్వం పద్మ అవార్డులకు ఎంపిక చేసింది. భారీ కొండ చిలువల విధ్వంసానికి భయంతో వణికిపోయిన అగ్రరాజ్యం అమెరికా సమస్యకు వీరు పరిష్కారం చూపడం విశేషం. అరుదైన ఇరుళర్‌ తెగకు చెందిన వడివేల్‌ గోపాల్‌, మాసి సడైయన్‌‌ల పేర్లు పద్మ అవార్డుల జాబితాలో ఉండటంతో వారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇరుళర్‌ తెగ... జనాభా లెక్కల ప్రకారం అత్యంత అరుదైనది.


తమిళంలో ‘ఇరుళర్‌’ అంటే ‘చీకటి’ అనే అర్థం. పేరుకు తగ్గట్టుగానే వారి జీవితాలు ఎంతో దుర్భరంగా ఉంటాయి. చదువు, ఉద్యోగాలు ఉండవు. ఎవరికైనా ఉద్యోగం వస్తే.. దాన్ని గొప్ప విషయంగా చూస్తారు. అలాంటి తెగకు చెందిన వీరు వారసత్వంగా వస్తున్న పనిలోనే నైపుణ్యం సంపాందించి, దానికి సాహసాన్ని జోడించి పద్మ పురస్కారాన్ని దక్కించుకున్నారు.


చెంగల్పట్టు జిల్లా చెన్నేరి అనే కుగ్రామానికి చెందిన వడివేల్‌ గోపాల్‌, మాసి సడైయన్‌లకు చిన్నతనం నుంచి అడవే ప్రపంచం. తండ్రుల నుంచి పాములు పట్టే విద్య నేర్చుకున్న వీరు.. ఎంతటి విష సర్పాన్నైనా సులువుగా లొంగదీసుకుంటారు. వీరి ప్రతిభ గురించి ప్రముఖ హెర్ఫెటాలజిస్ట్ అమెరికన్‌- ఇండియన్‌ రోములస్‌ ఎర్ల్‌ విటేకర్‌‌కు తెలిసింది. 2016-17 సంవత్సరంలో ప్లోరిడాలో బర్మీస్‌ పైథాన్‌లు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. 15 నుంచి 23 అడుగుల పొడవుతో భయంకరంగా ఉండే అనకొండలు మూగ జీవాలను తినేస్తూ భయం పుట్టించాయి.


ఊర్లలోకి చొరబడటంతో జనం హడలెత్తిపోయారు. అప్పట్లో ప్లోరిడా సర్కారు ఈ పైథాన్‌లను చంపేవారికి నగదు బహుమతుల్ని ప్రకటించింది. అంతేకాదు, వీటిని పట్టేవారిని చూపాలని పోటీల్ని నిర్వహించేది. ఈ నేపథ్యంలో వడివేల్ గోపాల్, మాసి సడైయన్ గురించి విటేకర్ ఫ్లోరిడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తమిళ ట్రాన్స్‌లేటర్ల సాయంతో ఈ ఇద్దరినీ ప్లోరిడాకు తీసుకెళ్లారు. సంప్రదాయ పద్ధతుల్లో కొండ చిలువలు పట్టే వీరిని చూసి అక్కడి ప్రజలు ఆశ్చర్యపోయారు.


అత్యంత నిపుణులుగా గుర్తింపు పొందిన వెయ్యి మంది కలిసి నెలల తరబడి 106 కొండ చిలువల్ని పడితే.. వీరిద్దరు నెలలోనే 30కిపైగా పట్టేవారు. అలాగే, స్థానికులకు శిక్షణ ఇవ్వడంతో ఇద్దర్ని ఘనంగా సన్మానించారు. తర్వాత పలు దేశాలకు వెళ్లి శిక్షణ ఇస్తున్నారు. విష సర్పాలపై పరిశోధనలకు థాయ్‌లాండ్‌ నిపుణులు వీరి సాయం కోరడం విశేషం. 2021లో విడుదలైన సూర్య నటించిన ‘జైభీమ్‌’ సంచలనం విజయం సాధించింది. ఇరుళర్‌ తెగపై జరుగుతున్న దాడులు, తప్పుడు కేసులను ఈ సినిమా కథగా ఎంచుకోవడంతో దేశంలో ఈ తెగపై చర్చ మొదలైంది. పలువురు ఆ తెగపై పుస్తకాలూ రాశారు. ఇరుళర్‌ తెగకు పద్మశ్రీ రావడం ఒక చరిత్రే.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa