పల్నాడు జిల్లా గురజాల నగర పంచాయతీ పరిధిలోని జంగమహేశ్వరపురం గ్రామంలో బుధవారం టీడీపీ మరియు వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. గ్రామానికి చెందిన ముగ్గురు టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు ఇనుపరాడ్లు, కర్రలతో విచక్షణా రహితంగా దాడులు చేశారు. ఈ దాడుల్లో టీడీపీ కార్యకర్త సంకటి నాగిరెడ్డి కుడి కాలు విరిగిపోయింది. ముఖంపై కూడా తీవ్ర గాయాలయ్యాయి. మరో కార్యకర్త కరుమూరి రాజశేఖరరెడ్డికి రెండు కాళ్లు, ఎడమచేయి విరిగాయి. ఇంకో కార్యకర్త భవనాసి గోపిరెడ్డి ఎడమ చేయి, కాలికి బలమైన గాయాలయ్యాయి. వీరికి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితుల కథనం మేరకు.. గ్రామంలో మంగళవారం రాత్రి ఓ టీడీపీ నేత పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ సమయంలో అటుగా వెళ్తున్న వైసీపీ నేతలకు, వేడుకలో పాల్గొన్న టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. దీనిని మనసులో పెట్టుకున్న వైసీపీ నేతలు.. బుధవారం మధ్యాహ్నం మాటువేసి టీడీపీ కార్యకర్తలపై దాడికి దిగారు. నాగిరెడ్డి బైక్పై గురజాలకు వెళ్తుండగా కారులో ఎదురుగా వచ్చి బైక్ను ఢీకొట్టారు. అతను కిందపడిపోగానే ఇనుపరాడ్లతో దాడి చేశారు. అలాగే రాజశేఖరరెడ్డి గ్రామంలోని బంధువుల ఇంటి వద్ద ఉండగా, అధికార పార్టీ నేతలు ఐదారుగురు అక్కడకు చేరుకుని రాడ్లు, కర్రలతో దాడి చేశారు. ఇక, గోపిరెడ్డి గ్రామంలో ఉండగా ఇతనిపై కూడా గుంపుగా వచ్చి దాడిచేశారు. వైసీపీకి చెందిన నక్కా పరమేశ్వరరెడ్డి, గాయం శ్రీనివాసరెడ్డి, కృష్ణారెడ్డి, యెనుముల రాజశేఖరరెడ్డి, శ్రీకాంత్రెడ్డి, పాపిరెడ్డి తమపై మారణాయుధాలతో దాడి చేశారని బాధితులు తెలిపారు. కాగా.. టీడీపీ కార్యకర్తలపై దాడి చేయడం వైసీపీ పతనానికి నిదర్శనమని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa