ఔను... నా వయసుకు నేను ఆంటీనే అని మంత్రి ఆర్.కె. రోజా అన్నారు. ఇటీవల నగరి నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర ప్రవేశించినప్పటి నుంచి నారా లోకేశ్, మంత్రి రోజా మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. రోజాను లోకేశ్ డైమండ్ పాప, జబర్దస్త్ ఆంటీ అంటూ ఎద్దేవా చేయగా, రోజా కూడా అంకుల్ అంటూ కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో, రోజా మరోసారి స్పందించారు.
"అవును నేను జబర్దస్త్ ఆంటీనే. దానికి అంతగా నవ్వుతూ జబర్దస్త్ ఆంటీ అని పిలవాలా? అంత వ్యంగ్యం ప్రదర్శించాల్సిన అవసరం ఏముంది? నాకు ఇద్దరు పిల్లలున్నారు... నా వయసుకు నేను ఆంటీనే. అందులో ఆశ్చర్యం ఏముంది?" అని రోజా ప్రశ్నించారు. లోకేశ్ వేసే జోకులకు జనాలు నవ్వడంలేదని, దాంతో తన జోకులకు తానే నవ్వుకుంటున్నాడని ఎద్దేవా చేశారు.
జగన్ మోహన్ రెడ్డిని చూసి తాను కూడా సీఎం అవ్వాలని లోకేశ్ పాదయాత్ర చేస్తున్నాడని, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా ఉందని రోజా విమర్శించారు. లోకేశ్ ఒక పొలిటికల్ జీరో అని ప్రజలే అంటున్నారని, పాదయాత్ర మొదటి నుంచి ఇప్పటివరకు గమనిస్తే ఆ విషయం లోకేశ్ కే అర్థమవుతుందని అన్నారు. లోకేశ్ మీటింగులకు ఎక్కడా జనం రావడంలేదని, అటు తమిళనాడు నుంచి ఇటు కర్ణాటక నుంచి ప్రజలను తీసుకువస్తున్నా వారు కూడా నిలిచే పరిస్థితి లేదని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa