ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అడవి పందులతో భీకరంగా పోరాడి తన బిడ్డను రక్షించుకున్న తల్లి.

national |  Suryaa Desk  | Published : Wed, Mar 01, 2023, 12:05 AM

కన్నప్రేగు ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది అనేలా ఓ తల్లి చేసిన పోరాట ఘటన ఇది. భయంకరమైన అడవి పందుల గుంపు. అందులో ఒకటి దున్నపోతు సైజులో ఉంది. తల్లితో కలిసి పొలం వద్దకు వచ్చి ఆడుకుంటున్న 11 ఏళ్ల చిన్నారి మీదకు అకస్మాత్తుగా దూసుకొచ్చింది. అది గమనించిన తల్లి క్షణం ఆలస్యం చేయకుండా తన బిడ్డకు అడ్డుగా నిలిచింది. అడవిపందితో భీకరంగా పోరాడింది. చివరికి అడవి పందిని చంపి, తన పాపను కాపాడి ప్రాణాలు విడిచింది. ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లా తెలియమార్ గ్రామంలో ఆదివారం (ఫిబ్రవరి 26) చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది. తన ప్రాణాలను ఫణంగా పెట్టి బిడ్డను కాపాడుకున్న ఆ తల్లికి జేజేలు పలుకుతున్నారు.


కోర్బా జిల్లాలోని మారుమూల గ్రామమైన తెలియమార్‌కు చెందిన గిరిజన మహిళ దువాసియా (45) రోజూలాగే ఆదివారం పొలం పనులకు బయల్దేరింది. సెలవు రోజు కావడంతో ఆమె 11 ఏళ్ల కుమార్తె రింకీ కూడా తల్లితో కలిసి పొలం వద్దకు వచ్చింది. వాళ్ల పొలం ఊరికి దూరంగా, అడవికి కాస్త దగ్గరగా ఉంది. దువాసియా పొలం పనుల్లో నిమగ్నమై ఉండగా.. అక్కడికి కాస్త దూరంలో తన పాప ఆడుకుంటోంది. ఇంతలో దూరంగా జంతువుల గుంపు కనిపించింది. దున్నపోతులు, గేదెలు అటుగా వెళ్తున్నాయేమో అని దువాసియా తొలుత భావించింది. కానీ, ఆమె అంచనా తప్పు. అది అడవి పందుల గుంపు. అందులో భయానకంగా ఉన్న ఓ అడవి పంది తన కూతురు మీదకు వస్తోంది.


దువాసియా ఆ దృశ్యం చూడగానే తన ఎదుట ఉన్న గడ్డపారను అందుకొని అడవి పంది మీదకు ఉరికింది. బిడ్డను అమాంతం ఎత్తుకొని, వెనక్కి విసిరేసి.. అడవి పందితో పోరుకు సై అంది. గునపం దింపినా.. అది అనూహ్యంగా తన మీదకు దాడికి దిగింది. పదునైన కోరలతో విరుచుకుపడింది. ఆమెను కిందపడేసి అదేపనిగా దాడి చేస్తోంది. చీరలో నుంచి దూరి కోరలతో కుమ్మేస్తోంది.


అమ్మ ప్రమాదంలో ఉందని గ్రహించిన బాలిక వెంటనే ఇంటికి పరుగు అందుకుంది. ఇద్దరి మధ్యా అక్కడ భీకర యుద్ధం జరుగుతోంది. అక్కడికి కొంత దూరంలో కొంత మంది రైతులు పొలం పనులు చేసుకుంటున్నా.. ఎవరికీ ఆ అలికిడి వినిపించలేదు. వినిపించినా అక్కడికి వచ్చి కాపాడేంత సమయంల లేదు.


దువాసియా తాను కిందపడినా పట్టు వీడలేదు. అడవి పంది మెడలో పదే పదే గునపంతో గుచ్చింది. కాసేపటి తర్వాత అది భీకరశబ్దం చేస్తూ ఓ వైపు కుప్పకూలింది. అడవి మృగంతో పోరాడి అలసిన ఆ తల్లి తీవ్ర గాయాలతో మరో వైపు ఒరిగిపోయింది.


ఈలోగా ఇంటికెళ్లిన ఆ పాప తన తండ్రి, కొంత మంది గ్రామస్థులతో కలిసి అక్కడికి తిరిగొచ్చింది. తండ్రి చెంతన సురక్షితంగా ఉన్న తన బిడ్డను దూరం నుంచి చూడగానే, అంత బాధలోనూ ఆమె ముఖం ఒకింత గర్వంతో వెలిగిపోయింది. గ్రామస్థులు ఆమె సమీపానికి వస్తుండగానే.. తుది శ్వాస విడిచింది. అక్కడి ఆనవాళ్లను చూస్తే.. అడవి పందితో ఆమె ఏ స్థాయిలో పోరాడిందో వాళ్లకు అర్థమైంది. ఆమె ధీరత్వానికి వారందరూ చేతులెత్తి జోహార్లు తెలిపారు.


సమాచారం అందుకున్న పోలీసులు కాసేపటి తర్వాత అక్కడికి చేరుకున్నారు. అక్కడ విగతజీవిగా పడిఉన్న దువాసియా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వాహనంలోకి ఎక్కించారు. ఆ తర్వాత ఫారెస్ట్ అధికారులు అడవిపంది మృతదేహాన్ని కూడా పంచనామా నిమిత్తం తీసుకెళ్లారు. ఈ మధ్య కాలంలో అంత పెద్ద అడవి పందిని చూడలేదని వారిలో ఒక అధికారి అన్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com