నాలుగొందల కిలోమీటర్లకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేరుకొంది. ఆయన పాదయాత్ర చంద్రగిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది. చంద్రగిరి నియోజకవర్గం గాదంకి టోల్ గేట్ క్యాంప్ సైట్ వద్ద సెల్ఫీ విత్ నారా లోకేష్ తర్వాత 31 వ రోజు యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. ఇవాళ పాదయాత్ర మరో మైలురాయిని దాటింది. యువగళం 400 కి.మీ చేరుకోగా.. పాకాల మండలం నరేంద్రకుంట మజిలీలో ఆధునిక వసతులతో 10 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసేందుకు శిలాఫలకం వేశారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో నరేంద్రకుంటలో పీహెచ్ సీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇక్కడ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఏర్పాటైతే, నరేంద్రకుంట పరిసర ప్రాంత ప్రజల వైద్యం కోసం పడే వ్యయప్రయాసలు తగ్గుతాయంటున్నారు టీడీపీ నేతలు.
నారా లోకేష్ను పాదయాత్రలో చంద్రగిరి మండల బలిజ సామాజిక వర్గానికి చెందిన వారు సమస్యలపై లోకేష్ కు వినతిపత్రం సమర్పించారు. గత టీడీపీ ప్రభుత్వం కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు 5శాతం రిజర్వేషన్ కోసం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ రిజర్వేషన్లు తమకు అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రగిరి రాయలకోట దగ్గర రాయలవారి విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని.. టీడీపీ అధికారంలోకి వస్తే తమకు రిజర్వేషన్ కల్పించి ఆదుకోవాలని కోరారు.
ఈ ప్రభుత్వం కాపు, బలిజ కార్పొరేషన్లు నిర్వీర్యం చేసిందని లోకేష్ ఆరోపించారు. బలిజ,కాపులకు నిర్లక్ష్యం చేయడమేగాక వారిని వేధించడమే పనిగా పెట్టుకుందన్నారు. గతం ప్రభుత్వం చేపట్టిన కాపు, బలిజ భవనాల నిర్మాణాన్ని నిలిపివేశారని.. స్వయం ఉపాధి రుణాలు లేకుండా చేశారు, కౌలు రైతులకు భరోసా లేకుండా చేశారని విమర్శించారు. కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందని.. ఏపీలోలోనే మొట్టమొదటిసారిగా కాపు,బలిజ,తెలగ, ఒంటరి కార్పొరేషన్ ఏర్పాటుచేశామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక బలిజ కాపుల రాజకీయ, ఆర్థిక, సామాజికాభివృద్ధికి కృషిచేస్తామని చెప్పారు.
పాదయాత్రలో కలిసిన చంద్రగిరి నియోజకవర్గం కావలివారిపల్లి గ్రామస్తులు కలిశారు. కావలివారిపల్లి, కె.వడ్డేపల్లి, అచ్చమ్మ అగ్రహారం గ్రామాల్లో ఎక్కడా డ్రైనేజిలు లేవని తెలిపారు. మురుగునీరు రోడ్డుపైకి వచ్చి దుర్వాసన, దోమలతో గ్రామప్రజలు అనారోగ్యం పాలవుతున్నామని తెలిపారు. గ్రామంలో సరైన వైద్యసదుపాయాలు కూడా లేవని.. పంచాయితీ, మండల అధికారులకు ఫిర్యాదుచేసినా కనీసం బ్లీచింగ్ కూడా చల్లించడం లేదన్నారు. ఎమ్మెల్యేని కలవడానికి తమను అనుమతించడం లేదన్నారు.
ఈ ప్రభుత్వం పంచాయితీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్నారు లోకేష్. పంచాయితీల అభివృద్ధి కోసమని కేంద్రం కేటాయించిన 8వేలకోట్ల రూపాయల నిధులను సర్పంచ్ లకు తెలియకుండా మాయం చేశారని.. దోచుకోవడం, దాచుకోవడంపై ఉన్న శ్రద్ధ గ్రామాల అభివృద్ధిపై లేదన్నారు. ప్రభుత్వం నిర్వాకం కారణంగా ఈరోజు గ్రామాల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా నిధుల్లేవన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో 25వేల కోట్ల కిలోమీటర్ల సిమెంటు రోడ్లు, 10లక్షలకుపైగా ఎల్ఇడి లైట్లు ఏర్పాటుచేసి అందంగా తీర్చిదిద్దామని.. స్థానిక సంస్థల బలోపేతం ద్వారా గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa