ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒంగోలు సుబ్బారావు గుప్తా అరెస్ట్,,,ఆయనకు అండగా నిలిచిన టీడీపీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 04, 2023, 08:21 PM

వైఎస్సార్‌సీపీ నేతకు టీడీపీ అండగా నిలిచింది. ఇది వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది మాత్రం నిజం.గుప్తాకు మద్దతుగా ర్యాలీ చేసింది. ప్రకాశం జిల్లా ఒంగోలు వైఎస్సార్‌సీపీ అసమ్మతి నేత సోమిశెట్టి సుబ్బారావు గుప్తాను గంజాయి కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే సుబ్బారావుపై అక్రమంగా కేసు పెట్టి అరెస్ట్‌ చేశారంటూ.. టీడీపీ వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో ఒంగోలులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక సీవీఎన్‌ రీడింగ్‌ రూం దగ్గర ఉన్న పొట్టి శ్రీరాముల విగ్రహం నుంచి గాంధీరోడ్డులోని గాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండి రాకేష్‌, టీడీపీ నేతలు పాల్గొన్నారు.


సుబ్బారావు గుప్తాపై అక్రమ కేసు బనాయించడం దారుణమన్నారు రాకేష్. రాష్ట్రంలోని వైశ్యులపై వైఎసస్సార్‌సీపీ నేతలు దాడులు చేసి కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా వైశ్యులు సంఘటితం కావాల్సిన అవసరం ఉందని.. గుప్తాపై పెట్టిన అక్రమ కేసును వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ఆర్యవైశ్యులని అణగతొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అంతకముందు టీడీపీ నేతలు సుబ్బారావు గుప్తా ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.


సోమిశెట్టి సుబ్బారావు గుప్తా దగ్గర గంజాయి ఉందని ఒంగోలులోని మంగమ్మ కళాశాల దగ్గర అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను పోలీస్ స్టేషన్‌కు తరలించి.. అనంతరం కోర్టులో హాజరుపరచగా.. రిమాండ్ విధించారు. ఇటీవల మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఆయన తనయుడు ప్రణీత్‌రెడ్డిపై గుప్తా విమర్శలు చేశారు. కొద్దిరోజులకే గంజాయి కేసులో అరెస్ట్ అయ్యారు.


సుబ్బారావు గుప్తా వైఎస్సార్‌సీపీ కార్యకర్తగా ఉన్నారు. గతంలో అప్పటి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకల్లో చేసిన వ్యాఖ్యలతో వివాదంరేగింది. పార్టీ తీరు, నేతలపై విమర్శలు చేశారు.. పార్టీకి నష్టం జరుగుతోందన్నారు. ఈ వీడియో వైరల్ కాగా.. సుబ్బారావు గుప్తా ఇంటిపై దాడి జరిగింది. దీంతో గుప్తా గుంటూరు వెళ్లి ఓ లాడ్జిలో తలదాచుకోగా.. ఒంగోలుకు చెందిన సుభానీ అనే వైఎస్సార్‌సీపీ కార్యకర్త సుబ్బారావుపై లాడ్జిలో దాడి చేశారు. ఈ వీడియో కూడా వైరల్ కాగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.


సుబానీని పోలీసులు అరెస్ట్ చేయడంతో.. ఆ తర్వాత సుబ్బారావు గుప్తా వెళ్లి బాలినేనిని కలవడంతో వివాదం సద్దుమణిగిందని భావించారు. కానీ కొద్ది రోజులకు మళ్లీ సొంత పార్టీపై విమర్శలు చేశారు. అక్కడితో ఆగకుండా తనకు ప్రాణాలకు ముప్పు ఉందని.. సెక్యూరిటీ ఇవ్వాలని కోరారు. ఆ తర్వాత నేరుగా ఢిల్లీ వెళ్లి నిరసనకు దిగారు.. కొద్ది రోజుల క్రితం సుబ్బారావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. మళ్లీ ఇప్పుడు గంజాయి కేసులో అరెస్ట్ అయ్యారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa