ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎవరు ప్రశ్నించినా అక్రమ కేసులు బనాయిస్తున్నారు: చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 04, 2023, 08:23 PM

 రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎవరు ప్రశ్నించినా అక్రమ కేసులు బనాయిస్తున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. అక్రమ కేసులు బనాయించే పోలీసులను వచ్చే టీడీపీ ప్రభుత్వంలో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. చేసిన తప్పులకు వారు శిక్ష అనుభవించాల్సిందేనని వ్యాఖ్యానించారు.


ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచకాల నుంచి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను కూడా తామే కాపాడాల్సిన పరిస్థితి వచ్చిందని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు, సుబ్బారావు గుప్తాలే ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. విజయవాడలోని ఎన్టీఆర్‌ భవన్‌ సమీపంలోని సీకే కన్వెన్షన్‌ హాల్‌లో చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. గత నాలుగేళ్లలో టీడీపీ శ్రేణులపై పోలీసులు బనాయించిన అక్రమ కేసులపై చర్చించారు. అలాగే, నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రభుత్వం కలిగిస్తున్న అడ్డంకులపై సమావేశంలో చర్చ జరిగింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ న్యాయ విభాగం అనుసరించాల్సిన విధానాలపై సమీక్షించారు.


ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..రాష్ట్రంలో రావణ కాష్టం తరహా పరిస్థితులు నెలకొంటే.. టీడీపీ లీగల్‌ సెల్‌ అందుకు ధీటుగా పని చేస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ అరాచకాల దెబ్బకు సామాన్య ప్రజలు బతికే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ తీరు వల్ల ప్రజలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో దాడులు చేసే హక్కు ఉందన్నట్లు డీజీపీ స్థాయి అధికారులే మాట్లాడే దుస్థితి రాష్ట్రంలో నెలకొందని దుయ్యబట్టారు.


వైసీపీ నేతలు విశాఖపట్నంలో రూ. 40 వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని చంద్రబాబునాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజల మెడపై కత్తిపెట్టి ఆస్తులు లాక్కుంటుంటే పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. చట్టాన్ని ఉల్లంఘించే అధికారులు, పోలీసులను వదలబోమని హెచ్చరికలు జారీ చేశారు. పొలిటికల్‌ రౌడీయిజాన్ని భూస్థాపితం చేస్తామన్నారు.


ఈ సందర్భంగా, విశాఖపట్నం నుంచే పరిపాలన సాగిస్తానంటూ సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలను కోర్టు ధిక్కరణగా పరిగణించవచ్చని న్యాయవాదులు అన్నారు. ఈ విషయంపై కోర్టులో కేసు వేయాలని చంద్రబాబును కోరారు. దీంతో సుప్రీం కోర్టులో ఉన్న రాజధాని అంశంపై మాట్లాడటం తప్పేనని చెప్పిన చంద్రబాబు.. ఈ అంశంపై అత్యున్నత న్యాయస్థానంలో త్వరలోనే సుప్రీం కోర్టులో విచారణ జరిగే అవకాశముందని చెప్పారు. సీఎం జగన్‌పై కోర్టు ధిక్కరణ కేసు వేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని వెల్లడించారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa