రాష్ట్రానికి రూ.13.6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. విశాఖపట్నం వేదికగా రెండు రోజుల పాటు జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు)లో 352 ఒప్పందాలు చేసుకున్నట్లు ఆయన అన్నారు. ఇన్వెస్టర్స్ సమ్మిట్ ముగిసిన అనంతరం మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి రూ.13.6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు.
ఈ సదస్సు ద్వారా రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని తొలుత తాము భావిస్తే అంతకు మించి.. రూ.13.6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి అమర్నాథ్ తెలిపారు. కొత్తగా వచ్చే పరిశ్రమల వల్ల రాష్ట్రంలో 6 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు. ఈ సదస్సు వల్ల ఏపీకి సహజ వనరులు ప్రపంచానికి తెలిశాయన్నారు. సదస్సులో 100 దేశాల ప్రతినిధులు, ఏడు దేశాల రాయబారులు పాల్గొన్నారని చెప్పారు.
పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండానే రాష్ట్రంలో పరిశ్రమల్ని స్థాపిస్తామని మంత్రి అమర్నాథ్ అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే ధ్యేయంగా విశాఖలో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, వనరులు, పరిస్థితులను దేశ విదేశాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. సదస్సును విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ సీఎం జగన్మోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన పారిశ్రామికవేత్తలకు సీఎం జగన్ అభినందనలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa