తవ్వేకొద్దీ విస్తుగొలిపే వాస్తవాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో బయటపడుతున్నాయి. నిందితుడు అఫ్తాబ్ పూనావాలా తాజ్ హోటల్లో శిక్షణ పొందిన చెఫ్ అని.. కత్తులను వినియోగించడంలో అతడికి నైపుణ్యం ఉందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అంతేకాదు, మాంసాన్ని వాడటం, భద్రపరచే విధానంపై నిందితుడికి పూర్తి అవగాహన ఉందని చెప్పారు. అలాగే, గతంలో మహారాష్ట్ర పోలీసులకు శ్రద్ధా వాకర్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్టుగానే ఆమె శరీరాన్ని ముక్కలుగా చేశాడని కేసు విచారణ సందర్భంగా కోర్టులో ఢిల్లీ పోలీసుల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
శ్రద్ధా హత్య కేసుకు సంబంధించి ఢిల్లీ సెషన్స్ కోర్టు విచారణలో ఢిల్లీ పోలీసుల తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా శ్రద్ధా వాకర్ గతంలో మహారాష్ట్ర పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును ప్రస్తావించిన ఎస్పీపీ.. భయపెట్టినట్లుగానే ఆఫ్తాబ్ నేరానికి పాల్పడ్డాడని న్యాయస్థానానికి వివరించారు. ఛార్జిషీట్లో పోలీసులు పేర్కొన్న అంశాలకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు అందించారు. శ్రద్ధాను హత్య చేసిన తర్వాత రక్తపు మరకలు కనిపించకుండా చేయడానికి డ్రై ఐస్, అగరవత్తులు, రసాయనాలను కొనుగోలుచేసినట్టు ఆధారాలను సమర్పించారు.
‘ఇరువురి మధ్య అభిప్రాయబేధాలు ఉన్నప్పటికీ కలిసే ఉన్నారు. ముంబయిలో మూడుచోట్ల ఇల్లు అద్దెకు తీసుకున్నారు.. కలిసి పనిచేసిన వీరి మధ్య గొడవలు వచ్చినప్పటికీ వాటిని సరిదిద్దుకునేందుకు ప్రయత్నం చేశారు.. అందులో భాగంగా పలు పర్యాటక ప్రదేశాలను సందర్శించారు.. చివరకు ఢిల్లీలో దిగిన తర్వాత శ్రద్ధాను చంపేయాలని నిర్ణయించుకున్న ఆఫ్తాబ్.. అందుకోసం కత్తులు కొనుగోలు చేశాడు. ఆమెను చంపి శవాన్ని ముక్కలుగా చేశాడు. కొత్త ఫ్రిజ్ కొని.. మూడు వారాల పాటు వాటిని భద్రపరిచాడు.. అనంతరం వాటిని వివిధ ప్రదేశాల్లో విసిరేశాడు..
హత్య జరిగిన వారంలోపే మరో మహిళతో రిలేషన్షిప్లోకి అడుగుపెట్టి.. ఆమెను తన అపార్ట్మెంట్కు తీసుకొచ్చి గడిపాడు.. శ్రద్ధాకు గతంలో బహుకరించిన ఉంగరాన్నే ఆమెకు ఇచ్చాడు.. సుమారు ఆరు నెలల తర్వాత కేసు బయటపడింది.. లభ్యమైన శరీర భాగాలకు డీఎన్ఏ పరీక్షలు చేయించగా అవి శ్రద్ధా తండ్రితో సరిపోలాయి.. ఆఫ్తాబ్ నేరం చేశాడనడానికి ఇవన్నీ సాక్షాలే’ అని న్యాయస్థానానికి వెల్లడించారు. హత్య చేసిన తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా శ్రద్ధా ఇన్స్టాగ్రామ్ ఖాతాలో నిందితుడే పోస్ట్లు పెట్టినట్టు పోలీసుల విచారణలో తేలింది. గత ఏడాది మే నెలలో హత్య జరిగితే.. నవంబరులో వెలుగులోకి వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa