ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢాాకా నగరంలో భారీ పేలుడు,,,రసాయనాల కారణంగా ఘటన జరిగినట్టు అనుమానం

international |  Suryaa Desk  | Published : Wed, Mar 08, 2023, 09:21 PM

బంగ్లాదేశ్‌రాజధాని ఢాకాలో తీవ్ర విషాధం చోటుచేసుకొంది. మంగళవారం సాయంత్రం ఓ భవనంలో పేలుడు సంభవించి 17 మంది మృతి చెందారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. పాత ఢాకా గులిస్థాన్ ప్రాంతంలోని ఏడంతస్తుల భవనంలో ఈ శక్తివంతమైన పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనకు కారణాలు తక్షణమే తెలియరాలేదు. భవనంలో కొన్ని రసాయనాలను అక్రమంగా నిల్వ చేస్తున్నారనీ, పేలుడుకు అవే కారణమై ఉంటాయని స్థానికులు అనుమానిస్తున్నారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగి ఉంటుందనీ, దీని వెనుక విద్రోహచర్య ఉండకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు.


దుకాణాలు, ఆఫీసులు ఉన్న ఈ భవనం కింది అంతస్తులో చాలా మంది చిక్కుకున్నారు. పేలుడు అక్కడే సంభవించడంతో మొదటి రెండు అంతస్తులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రాణనష్టం మరింత పెరగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. చాలా మంది మెదడులో రక్తస్రావం వల్లనే చనిపోయారని బంగ్లాదేశ్ వైద్యశాఖ మంత్రి జాహిద్‌ మలేక్‌ తెలిపారు. మంటలను అదుపుచేయడానికి 11 ఫైర్ ఇంజిన్లు, 200 మందికిపై అగ్నిమాపక సిబ్బంది, బాంబు నిర్వీర్యక దళాలను ఘటనాస్థలికి తరలించారు.


సహాయక చర్యలు చేపట్టి.. లోపలి చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీశారు. గాయపడినవారిని ఢాకా మెడికల్ కళాశాల ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. శిథిలాల కిందట చాలా మంది ఉన్నారని, వారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. సిద్ధిఖ్‌ బజార్‌ ప్రాంతంలో స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4.50 గంటలకు పేలుడు సంభవించింది. ఈ పేలుడు తర్వాత అక్కడ భూకంపం సంభవించినట్లు అనిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.


పేలుడు తర్వాత భవనం ముందు భాగంలోని రోడ్డుపై 20 నుంచి 25 మంది తీవ్ర గాయాలతో పడి ఉన్నారని ఓ వ్యక్తి చెప్పారు. బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా భీతావాహంగా మారింది. భయంతో జనం పరుగులు తీశారు. గాయపడినవారిని వ్యాన్లు, రిక్షాల్లో ఆస్పత్రికి స్థానికులు తరలించారు. సమీప భవనాల అద్దాలు పగిలి చెల్లాచెదురయ్యాయి. కొన్ని వాహనాలు దెబ్బతిన్నాయి. పాదచారులకు గాయాలయ్యాయి.


పేలుడు జరిగిన ప్రదేశానికి సమీపంలో ఉన్న ఆలంగిర్ అనే వ్యక్తి మాట్లాడుతూ.. ‘పెద్ద శబ్ధం రావడంతో జనం వెంటనే భవనం నుంచి బయటకు వచ్చారు.. అందరి ముఖాల్లో భయాందోళన నెలకొంది. భవనం కిటికీల అద్దాలు పగిలి వీధిలో పడ్డాయి.. వీధిలో చాలా మంది పాదచారులు గాయపడ్డారు.’ అని చెప్పారు.


భవనాలను పరిశీలించడానికి ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్‌కు చెందిన బాంబు నిర్వీర్య యూనిట్ ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టింది. ‘ఈ పేలుడు వెనుక ఏదైనా విద్రోహ చర్య కారణమా? లేదా? అని మేము ఇంకా నిర్ధారించలేం.. అయితే మా సైనిక బాంబు నిర్వీర్య విభాగం, పోలీసు బాంబు నిర్వీర్య బృందాలు పనిచేస్తున్నాయి’ అని ఆర్ఏబీ డైరెక్టర్ జనరల్ ఖుర్షీద్ హుస్సేన్ పేర్కొన్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa