ఆంధ్రప్రదేశ్లో ఈ వేసవికి విద్యుత్ కోతలు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. సీఎం జగన్ ఆదేశాలతో ప్రణాళికాబద్ధంగా వేసవి డిమాండ్ని అధిగమిస్తామని పేర్కొన్నారు.
గత ఏడాది కంటే ఈ వేసవిలో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉందని విజయానంద్ తెలిపారు. గతేడాది ఫిబ్రవరిలో రోజుకు సరాసరి 202 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంటే, ఈ ఏడాది ఫిబ్రవరిలోనే 227 మిలియన్ యూనిట్లకి పెరిగిందన్నారు. గతేడాది మార్చిలో రోజుకి 212 మిలియన్ యూనిడ్ల డిమాండ్ ఉంటే.. ఇపుడు 232 మిలియన్ యూనిట్లకి డిమాండ్ పెరిగిందని తెలిపారు. గతేడాది ఏప్రిల్లో పీక్ డిమాండ్ 232 మిలియన్ యూనిట్ల కాగా, ఈ ఏడాది మార్చి రెండో వారంలోపే 232 మిలియన్ యూనిట్లు దాటామన్నారు. గడిచిన ఏడాది కాలంలో ఏపీలో పెరిగిన పరిశ్రమల కారణంగా వాణిజ్య అవసరాలకి 18 శాతం, పరిశ్రమలకి 20.31 శాతం విద్యుత్ వినియోగం పెరిగిందని విజయానంద్ వివరించారు.
ఈ కారణంగానే విద్యుత్ డిమాండ్ ఊహించని విధంగా రికార్డు స్థాయికి పెరిగిందని విజయానంద్ అన్నారు. మార్చి నెలాఖరుకి 240 మిలియన్ యూనిట్లు.. ఏప్రిల్కి 250 మిలియన్ యూనిట్లకి డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఏప్రిల్ నెలలో ఒక్క వ్యవసాయానికే సరాసరిన 50 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుందని.. పెరిగిన డిమాండ్ కి తగ్గట్లుగా విద్యుత్ కోతలు లేకుండా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. పరిశ్రమలకు, గృహ అవసరాలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉంటుందని.. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫారా కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు.
కృష్ణపట్నం మూడో యూనిట్ ద్వారా 800 మెగా వాట్ల విద్యుత్ నేటి నుంచి పూర్తిగా అందుబాటులోకి వచ్చిందని విజయానంద్ తెలిపారు. అలాగే, సెమ్ కాబ్ ద్వారా 500 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వచ్చిందని.. మార్కెట్లో యూనిట్ ధర 12 రూపాయిలు ఉంటే, వేసవి అవసరాలను దృష్డిలో పెట్టుకుని ముందుగానే మార్చి, ఏప్రిల్ నెల కోసం యూనిట్ 7.90 రూపాయలకు విద్యుత్ కొనుగోలుకు ఎంఓయూ చేసుకున్నట్లు చెప్పారు. అలాగే, ఇతర రాష్ట్రాలతో 300 మెగా వాట్ల విద్యుత్కి బ్యాంకింగ్ ఒప్పందాలు చేసుకున్నామని విజయానంద్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa