కర్ణాటక రాష్ట్రంలో ఘోరం చోటు చేసుకొంది. ఏసీలో పేలుడు సంభవించి తల్లీ, ఇద్దరు కుమార్తెలు మంటలకు ఆహుతి అయ్యారు. కర్ణాటకలోని రాయచూర్లో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాండ్యా జిల్లాకు చెందిన రంజిత (33) తన భర్త సిద్ధలింగయ్య, ఇద్దరు కుమార్తెలు మృదుల (13), తారుణ్య (5)తో కలిసి రాయచూరు పరిధిలోని శక్తినగర్ కేపీసీఎల్ కాలనీలో నివసిస్తోంది. సోమవారం (మార్చి 6) మధ్యాహ్నం వారు నివాసం ఉంటున్న ఇంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రంజిత, ఆమె ఇద్దరు కుమార్తెలు సజీవదహనమయ్యారు. సిద్ధలింగయ్య స్థానిక శక్తినగర్ థర్మల్ కేంద్రంలో ఏఈగా పనిచేస్తున్నారు. ఆయన ఇంట్లో లేని సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.
ఈ ప్రమాదం అనంతరం చుట్టుపక్కల ఇళ్లలోకి దట్టమైన పొగ వ్యాపించింది. స్థానికులు ఆందోళనకు గురయ్యారు. స్థానికుల నుంచి అందిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. ఏసీలో పేలుడు సంభవించి మంటలు వ్యాపించినట్లు అనుమానిస్తున్నారు. అయితే, ఏసీలో మంటల చెలరేగడానికి స్పష్టమైన కారణం తెలియరాలేదు. ఏసీలో ప్రమాదం జరిగిందా? లేదా మరేదైనా ఎలక్ట్రిక్ వైరు కాలిపోయి మంటలు వ్యాపించాయా? ఇంకేదైనా కారణం ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
రంజిత తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు. మృతదేహాలను రిమ్స్ మార్చురీకి తరలించారు. ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని.. రాయచూరు డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు. తల్లిదండ్రులు వచ్చిన తర్వాత విచారిస్తామని ఆయన చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa