ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘నోబెల్ శాంతి ప్రైజ్’ రేసులో ప్రధాని మోడీ ఉన్నారంటూ వార్తలు చక్కర్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 17, 2023, 08:13 PM

తాజాగా సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకొంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి నోబెల్‌ శాంతి బహుమతి రేసులో ముందంజలో ఉన్నారని రెండు రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ప్రకటించే అవార్డుల్లో ప్రధాని మోదీకి ‘నోబెల్ శాంతి బహుమతి’ దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ‘ప్రపంచం శాంతిని, స్నేహాన్ని కోరుకోవడంలో ప్రధాని మోదీ ఎప్పుడూ ముందుంటారు. కోవిడ్ సంక్షోభ సమయంలో అనేక దేశాలకు వ్యాక్సిన్లు, ఔషధాలు సరఫరా చేసి అండగా నిలిచారు. కీలక నిర్ణయాలతో దేశాన్ని ఆర్థిక సంక్షోభంలో పడనీయకుండా కాపాడారు. అన్ని దేశాలతో స్నేహాన్ని కొనసాగిస్తూ దేశాభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఈసారి నోబెల్ శాంతి బహుమతి.. మోదీని వరిస్తుంది’ అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. నోబెల్ శాంతి బహుమతి రేసులో ప్రధాని మోదీ ఉన్నారంటూ పలు మీడియా సంస్థలు కూడా పతాక స్థాయిలో వార్తలు ప్రచురించారు. ఈ వార్తల్లో వాస్తవం ఎంత?


నార్వేకు చెందిన నోబెల్ అవార్డ్స్ కమిటీ ఇటీవల భారత్‌లో సందర్శించింది. నోబెల్ శాంతి బహుమతి విజేతను నిర్ణయించే కమిటీ డిప్యూటీ ఛైర్మన్ అస్లే టోజే కూడా వీరిలో ఉన్నారు. భారత పర్యటన సందర్భంగా ప్రధాని మోదీపై ఆయన ప్రశంసలు కురిపించారు. ప్రపంచానికి ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు.


‘ఇది యుద్ధాల శకం కాదు..’ అంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోదీ గతంలో అన్నమాటను అస్లే టోజే గుర్తు చేశారు. ఉక్రెయిన్‌పై దండయాత్ర విషయమై మోదీ చేసిన ఈ వ్యాఖ్య ప్రపంచవ్యాప్తంగా పలువురు దేశాధినేతల నుంచి సామాన్య ప్రజల వరకు అందరి మన్ననలు పొందిన విషయం తెలిసిందే.


అస్లే టోజే వ్యాఖ్యలను కోట్ చేస్తూ.. ప్రధాని మోదీకి ఈసారి నోబెల్ శాంతి బహుమతి దక్కే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ వార్తల నేపథ్యంలో అస్లే టోజే తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. నోబెల్ శాంతి బహుమతి గురించి తాను ఎక్కడా ప్రకటన చేయలేదని స్పష్టం చేశారు. అవన్నీ ఫేక్ వార్తలేనని ఖండించారు. ఇక అంతకుమించి ఆ అంశంపై తాను వ్యాఖ్యలు చేయబోనని అన్నారు. ఇంకేం మాట్లాడినా, అవి ఆ వార్తలకు ఊతమిచ్చినట్లు అవుతుందని ఆయన పేర్కొన్నారు. నోబెల్ ప్రైజ్ కమిటీ డిప్యూటీ ఛైర్మన్‌గా తన నిర్ణయానికి ప్రాధాన్యం ఉంటుందని, అయితే.. ప్రతిష్టాత్మకమైన ఆ పురస్కారంపై తాను బహిరంగంగా వ్యాఖ్యలు చేయబోనని అస్లే టోజే పేర్కొన్నారు.


ప్రధాని మోదీని నోబెల్ శాంతి బహుమతి వరించే అవకాశం ఉందని గతంలోనూ పలుమార్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుల్లో నోబెల్ శాంతి ప్రైజ్ ఒకటి. శాంతిని పెంపొందించడం, సంఘర్షణలను పరిష్కరించడానికి గణనీయమైన కృషి చేసిన వారికి నోబెల్ శాంతి బహుమతి ప్రదానం చేస్తారు.


ప్రధాని మోదీకి 2018లో ప్రతిష్టాత్మక సియోల్ శాంతి బహుమతి లభించింది. అంతర్జాతీయ సహకారానికి, ప్రపంచ ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి ఆయన చేసిన కృషికి గాను ఈ పురస్కారాన్ని అందజేశారు. మోదీ కంటే ముందు ప్రపంచవ్యాప్తంగా 13 మంది ప్రముఖులు మాత్రమే ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అభిమానులు కోరుకున్నట్లు ఆయన ఈసారి ‘నోబెల్ శాంతి’ పురస్కారాన్ని అందుకుంటే, అది చరిత్రాత్మకమే అవుతుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa