ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లి కానుకగా కోట్లు ఇచ్చి... మేనకోడల్ని ఆశ్చర్యపర్చిన మామలు

national |  Suryaa Desk  | Published : Sat, Mar 18, 2023, 08:58 PM

పెళ్లి తంతులో కానుకలు రావడం సహజం. కానీ కోట్లలో ఎవరైనా కానుకలు ఇస్తే మాత్రం కాస్త ఆశ్చర్యపోవాల్సిందే.  పెళ్లి సందర్భంగా మేనమామలు పెట్టే కానుకలను ప్రత్యేకంగా భావిస్తారు. కొంత మంది ఆడబిడ్డలు తమ ‘హక్కు’గా అడిగి మరీ సోదరుల చేతుల మీదుగా పెద్ద మొత్తంలో కట్నాలు పెట్టించుకుంటారు. ఇంకొందరైతే, స్వతహాగా ప్రేమతో.. ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ మొత్తం కానుకలు పెడతారు. ఎంత ప్రేమ ఉన్న వారైనా.. లక్ష రూపాయలో, 5 లక్షలో పెడితే అదే ఎక్కువ. కానీ, కోట్ల రూపాయల కట్నాలు పెట్టే మేనమామలు ఉంటారా? వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా.. రాజస్థాన్‌లో ఓ యువతి పెళ్లి సందర్భంగా ఆమె మేనమామలు ఏకంగా 3 కోట్ల 21 లక్షల రూపాయల విలువైన కానుకలు పెట్టారు. ఆ యువతి, యువతి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. వేడుక చూసేందుకు వచ్చిన బంధువులు ఆ కానుకలను చూసి నోరెళ్లబెట్టారు. అంతేకాదు, రికార్డు స్థాయిలో వీరు కట్నాలు పెట్టిన ఘటన ఇప్పుడు దేశంలోనే హాట్ టాపిక్‌గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


రాజస్థాన్‌‌లోని నాగౌర్‌ జిల్లాకు చెందిన భన్వర్‌లాల్ పొటాలియా, దేవి దంపతులు తమ కుమార్తె అనుష్కకు పెళ్లి నిర్ణయించారు. పెళ్లి వేడుకలో భాగంగా 4 రోజుల కిందట వధువు ఇంట్లో ‘మైరా’ కార్యక్రమం నిర్వహించారు. బుర్డీ గ్రామం నుంచి అమ్మాయి తాత (తల్లి తండ్రి) భన్వర్‌లాల్ గర్వా తన ముగ్గురు కుమారులతో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు. హరేంద్ర, రామేశ్వర్‌, రాజేంద్ర అనే ముగ్గురు అన్నదమ్ములు తమ మేనకోడలి కోసం పెద్ద మొత్తంలో కట్నకానుకలతో వచ్చారు.


మేనకోడలి పెళ్లి సందర్భంగా రూ. 3.21 కోట్ల విలువ చేసే నగదు, ఆస్తులను కట్నంగా ఇచ్చారు ఈ ముగ్గురు సోదరులు. అందులో రూ. 80 లక్షల నగదు, 41 తులాల బంగారం, 3 కిలోల వెండి ఉన్నాయి. వీటితో పాటు 10 ఎకరాల వ్యవసాయ భూమి, రూ.30 లక్షలు విలువ చేసే స్థలాన్ని కానుకగా ఇచ్చారు. ఒక ట్రాక్టర్‌, స్కూటీని కూడా మేనకోడలికి గిఫ్ట్‌గా ఇచ్చారు. ట్రాక్టర్ ట్రాలీ నిండా ధాన్యం, ఇతర సరకులను తీసుకొచ్చారు. సంప్రదాయం ప్రకారం ఈ కానుకలు, అందుకు సంబంధించిన పత్రాలన్నింటినీ పెద్ద తంబాలంలో పెట్టుకొని వేదిక వద్దకు మోసుకొచ్చారు. అది చూసి బంధువులందరూ ఆశ్చర్యపోయారు.


ఈ కానుకలే కాకుండా, వధువు ఊళ్లోని ప్రతి ఇంటికి ఓ వెండి నాణేన్ని కానుకగా ఇచ్చారు ఈ ముగ్గురు సోదరులు. ‘భారతీయ సంప్రదాయంలో ఉన్న విలువలు ఎంతో అమూల్యమైనవి. ముఖ్యంగా అన్నా చెల్లెల్ల మధ్య అనుబంధం ఎంతో విలువైంది. అందుకు తార్కాణమే ఇది’ అని ఈ వేడుకకు హాజరైన ఓ బంధువు అన్నారు.


ఇంత పెద్ద మొత్తంలో కట్నకానులకు సమర్పించడంతో ఆ మేనమామలను అందరూ పొగడ్తల్లో ముంచెత్తున్నారు. ఆ కానుకలను చూసి దేవి, ఆమె భర్త కూడా నిశ్చేష్టులయ్యారు. అయితే, ఇదేమంత గొప్ప విషయం కాదంటూ దేవి తండ్రి తన నిరాడంబరతను చాటుకున్నారు. ‘నా కుమార్తె దేవి మా కుటుంబానికి అదృష్టం. ఈ సంపద అంతా ఆమె ఆశీర్వాదం. నా కుమారులకు ఆమె ఎంతో సాయం చేసింది. దాన్ని ఆమెకు తిరిగి ఇవ్వడం మర్యాద మాత్రమే’ అని ఆ పెద్దాయన చెప్పారు.


అనుష్క పెళ్లి గురువారం (మార్చి 16) ఘనంగా జరిగింది. రాజస్థాన్‌లోని మార్వారీలు పెళ్లి సమయాల్లో నిర్వహించే సంప్రదాయం ‘మైరా’. దీన్నే ‘మమేరా’ అని కూడా అంటారు. ఇందులో భాగంగా వధువు/ వరుడి తాత (తల్లి తండ్రి) లేదా మేనమామలు తమకు తోచినంత మొత్తంలో కట్నాలు సమర్పించుకుంటారు. అయితే, మేనమామలు ఈ స్థాయిలో ‘ప్రేమ’ కురిపించడం మాత్రం ఇదే తొలిసారి!!







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa