ఇటీవల జరిగిన గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో విజయం సాధించిన టీడీపీ తాజాగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై నజర్ పెట్టింది. ఇదిలావుంటే ఎమ్మెల్యే కోటాలో పోటీచేస్తున్న అభ్యర్దులు గెలవాలంటే.. 22 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సి ఉంది. ఆలెక్కన వైసీపీకి ఆరు స్థానాలు సునాయాసంగా దక్కుతాయి. ఏడో స్థానానికి కూడా జనసేన, టీడీపీ నుంచి పరోక్షంగా మద్దతిస్తున్న సభ్యులతో గెలిచే అవకాశం ఉంది. అయితే, అధికార పార్టీ నుంచి ఇద్దరు సభ్యులు దూరం జరిగారు. దీంతో ఇప్పుడు ఈ ఎన్నిక ఉత్కంఠ భరితంగా మారింది. అధికార వైసీపీకి 151 స్థానాలు ఉండగా.. టీడీపీకి 23, జనసేనకు 1 వంతున సభ్యులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి నలుగురు సభ్యులు గత కొంత కాలంగా సీఎం జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.
ఇటు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా అదే దారిలో ఉన్నారు. దీంతో వైపీపీ బలం 156కు చేరింది. టీడీపీ బలం 19కు పడిపోయింది. ఈక్రమంలోనే వైసీపీ నుంచి ఇద్దరు సభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దూరం జరిగారు. దీంతో వైసీపీ బలం 154కు పడిపోయింది. ఈ లెక్కన ఏడో స్థానం నూటికి నూరు శాతం వైసీపీ సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే.. 20 మందికిపైగా శాసనసభ్యులు టీడీపీకి టచ్లో ఉన్నారని.. వారిలో కొందరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కూడా సిద్దమయ్యే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది. దీంతో సీఎం జగన్ అప్రమత్తమయ్యారు.
మరోవైపు ఏడో స్థానం గెలవాలంటే 22 మంది సభ్యుల బలం కావాలి. అధికారికంగా టీడీపీకి 23 మంది సభ్యులున్నారు. వారిలో నలుగురు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తే.. ఆ సంఖ్య 19కి పడిపోతుంది. ఇటీవల వైసీపీపై తిరుగుబాటు చేసిన ఇద్దరు శాసనసభ్యులు టీడీపీకి అనుకూలంగా ఓటు వేస్తే ఆ బలం 21కి పెరుగుతుంది. అయినా కూడా మరో సభ్యుని ఓటు టీడీపి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో గత అధికార పార్టీపై అసంతృప్తితో తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్న కొంత మంది ఎమ్మెల్యేలను ఏడో స్థానం గెలుపుకోసం ఉపయోగించుకోవాలని బాబు వ్యూహ రచన చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇటు సభ్యులు కూడా తెలివిగా వ్యవహరించే అవకాశం ఉంది. అందుకే జగన్, చంద్రబాబు ముందస్తు ఆలోచనలు చేస్తున్నారు. ఇరు పార్టీలు విప్ జారీచేసిన సందర్భంలో ఓటింగ్కు హాజరై.. చెల్లకుండా ఓటేస్తే వచ్చే ప్రమాదాన్ని కూడా ముందుగానే ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సభ్యులు ఓటింగ్కు హాజరై.. ఓటు చెల్లకుండా వేస్తే ఏపార్టీకి నష్టం జరుగుతుందన్న దానిపై ఎవరికివారే లెక్కలేసుకుంటున్నారు. టీడీపీకి చెందిన నలుగురు సభ్యులు ఓటు చెల్లకుండా వేస్తే పరిస్థితి ఏంటి.. అలాగే వైసీపీకి చెందిన ఇద్దరు సభ్యులు కూడా ఓటు చెల్లకుండా వేస్తే ఎదురయ్యే పరిస్థితులేంటన్న దానిపై ఇరు పార్టీల నేతలు చర్చించుకుంటున్నారు.
ఈ క్రమంలోనే సీఎం జగన్ ఒక్కో మంత్రికి 22 మంది ఎమ్మెల్యేలను అప్పగించి.. ఏడుగురుతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. సభ్యులందరికీ మాక్ పోలింగ్ నిర్వహించారు. ఓటు ఎలా వేయాలన్న దానిపై అవగాహన కల్పిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అనుమానంగా ఉన్న వారితో ప్రత్యేకంగా మాట్లాడుతన్నారు. ఇదే విధానాన్ని తెలుగుదేశం పార్టీ కూడా అనుసరిస్తుంది. దీంతో ఇప్పుడు ఈ ఎన్నికలు హాట్ టాపిక్గా మారాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa