తమది సరిహద్దులు లేని సేవా ఆధారిత దేశమని కైలాస ప్రతినిధులు తాజాగా వెల్లడించారు. అత్యాచారం, అపహరణ వంటి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ నాలుగేళ్ల కిందట దేశం విడిచి పారిపోయిన వివాదాస్పద నిత్యానంద కైలాస పేరుతో ఓ దేశాన్ని ఏర్పాటు చేసినట్టు ప్రకటించి వార్తల్లో నిలిచారు. గత నెలలో తాము పరమశివమ్ నిత్యానంద ప్రతినిధులమంటూ విజయప్రియ నిత్యానంద అనే మహిళతో పాటు ఓ ఇద్దరు ఐక్యరాజ్య సమితిలో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. కైలాస దేశానికి చెందిన వ్యక్తులమని.. అమెరికా సహా అనేక నగరాలతో పలు ఒప్పందాలు చేసుకున్నట్టు చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. వీటిపై అంతర్జాతీయంగా విమర్శలు రావడంతోపాటు ‘కైలాస’ పేరుతో ఓ దేశం కూడా ఉందా..? అనే సందేహాలు ఉత్పన్నమయ్యాయి.
ఈ విమర్శలపై స్పందించిన ‘కైలాస’ ప్రతినిధులు.. తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ఆ పేరుతో భౌగోళికంగా దేశం ఏదీ లేదని.. తమది సరిహద్దులు లేని సేవా ఆధారిత దేశమని స్పష్టం చేశారు.
కైలాస దేశం ఎక్కడుంది..? జనాభా ఎంత..? ఎప్పుడు స్థాపించారు..? 100 శాతం హిందూ దేశమా?.. ఎటువంటి సంప్రదాయాలను అనుసరిస్తోంది? ఏదైనా అధికార భాష లేదా జాతీయ గీతం ఉందా? అనే ప్రశ్నలకు నిత్యానంద ప్రతినిధులు ట్విట్టర్ ద్వారా బదులిస్తూ.. ‘ప్రాచీన హిందూ నాగరికత పునరుద్ధరణకు కృషి చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఐరాస గుర్తింపు పొందిన స్వచ్ఛంద సంస్థల ద్వారా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాం.. సావరిన్ ఆర్డర్ ఆఫ్ మాల్టా (భౌగోళికంగా లేనప్పటికీ దేశంగా గుర్తింపు) దేశం స్ఫూర్తితో సరిహద్దులు లేని సేవా ఆధారిత దేశం మాది. కుల, మత, లింగ భేదం లేకుండా ప్రతి ఒక్కరి ఆనందమే మా ధ్యేయం’ అని బదులిచ్చారు.
కైలాస దేశాన్ని ఎలా సందర్శించాలి? దేశంగా ప్రకటించుకోవడానికి ఎటువంటి రుజువులు ఉన్నాయి..? ఎటువంటి వ్యవస్థలు ఉన్నాయి? ఎన్నికలు నిర్వహిస్తారా? రాజ్యాంగ వ్యవస్థ ఉందా? అని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ‘సావరిన్ ఆర్డర్ ఆఫ్ మాల్టా మాదిరిగానే కైలాస కూడా కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ఆలయాలతోపాటు వివిధ దేశాల్లో ఉన్న మఠాల ద్వారా వ్యవహారాలు కొనసాగిస్తుంది’ అని వివరణ ఇచ్చారు.
ఇది నిజానికి సార్వభౌమ దేశమైతే.. ఐరాస, సిటీ ఆఫ్ నెవార్క్, ఇతర మీడియా సంస్థలు కైలాసాన్ని నకిలీ అని ఎందుకు ఆరోపించాయి.. దానిని గుర్తించలేదని ఎందుకు చెప్పారు? కైలాస దేశం అని రుజువు చేసే డాక్యుమెంటేషన్ ఏమైనా ఉందా? ఏ ఇతర దేశాలు దీనిని గుర్తించాయా?.. నిత్యానంద పరమశివం అత్యాచారం, మోసాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై మీరు స్పందించాలనుకుంటున్నారా? అన్న ప్రశ్నలకు స్పందిస్తూ.. ఈక్వెడార్ ప్రాంతంలో సొంతంగా ద్వీపముందని నిత్యానంద చెప్పడంపైనా వివరణ ఇచ్చిన ప్రతినిధులు.. నిత్యానంద అలా ఎప్పుడూ చెప్పలేదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa