రాష్ట్ర విభజనతో వైభవం కోల్పోయిన ఏపీ కాంగ్రెస్ కు తాజాగా సరికొత్త సమస్య వచ్చిపడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాలను దశాబ్దాల పాటు శాసించిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు అత్యంత దయనీయంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన ద్వారా ఏపీలో పార్టీ పరిస్థితి అత్యంత ఘోరంగా తయారైంది. దేశ రాజకీయాలను ఏలిన జాతీయ కాంగ్రెస్.. ఇప్పుడు పార్టీ కార్యాలయాలకు ఆస్తి పన్ను కూడా కట్టలేని దుస్థితికి చేరుకుంది. ఈ పరిస్థితి ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఏఐసీసీకి రాసిన లేఖ సాక్ష్యంగా నిలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు ఆస్తి పన్ను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి నోటీసులు వచ్చాయి. రాష్ట్రంలోని 9 కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు గానూ రూ. 1.40 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాలని పేర్కొంది. దీంతో పెండింగ్లో ఉన్న ఆస్తి పన్ను చెల్లింపు వివరాలను ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు.. ఏఐసీసీ ట్రెజరర్ దృష్టికి లేఖ ద్వారా తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఏఐసీసీ.. స్థానికంగానే నిధులు సమీకరించుకుని బకాయిలు చెల్లించుకోవాలని సమాధానం ఇచ్చింది. దీంతో పార్టీలోని సీనియర్లను, పార్టీ సానుభూతిపరులను విరాళాలు కోరుతూ గిడుగు రుద్రరాజు లేఖ రాశారు. విరాళాలు ఇచ్చే వారు ఏ ఖాతాల్లో వేయాలనే బ్యాంకు వివరాలను కూడా ఆ లేఖలో పేర్కొన్నారు.
ఏఐసీసీకి రాసిన లేఖలో వివిధ జిల్లాల కార్యాలయాలకు పెండింగ్లో ఉన్న ఆస్తి పన్ను వివరాలను గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. విశాఖపట్నం పార్టీ కార్యాలయానికి రూ.30 లక్షలు, కాకినాడ రూ.42,71,277, ఏలూరు రూ.6,29,926, విజయవాడ రూ.41,73,917, గుంటూరు రూ.3,92,282, ఒంగోలు రూ. 5,31,783, నెల్లూరు రూ.1,51,867, కడప రూ.6 లక్షలు, కర్నూలు రూ.2,94,890.. ఇలా మొత్తంగా రూ.1.40 కోట్లకు పైగా పెండింగ్లో ఉన్న వివరాలను లేఖలో పొందుపర్చారు.
దీనిపై అధిష్టానం స్పందించిన తర్వాత.. ఇప్పుడు ఫండ్ వసూలుకు పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు పూనుకున్నారు. అసలే, 2024 ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఇటీవలే పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన గిడుగు రుద్రరాజు.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ 100కి పైగా ఎమ్మెల్యేలను గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 100 సీట్ల సంగతి ఎలా ఉన్నా, కనీసం పార్టీ కార్యాలయాలకు ఆస్తి పన్ను చెల్లించలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉండటం పట్ల పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఫీలవుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎప్పుడు మెరుగవుతుందో అని నిస్తేజంగా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa