చంద్రబాబుకు వెన్నుపోటు అన్నది బాగా అలవాటు అని ఏపీ మంత్రులు రోజా, కాకాణి గోవర్థన్ రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీది అనైతిక విజయమని వారు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలో ఏపీఎస్ఎస్డీసీ ఆవరణలో డాక్టర్ వైఎస్సార్ విత్తన పరిశోధన, శిక్షణ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై మంత్రులు స్పందించారు. సీఎం జగన్ను ఎవరు వ్యతిరేకించినా అది వారికే నష్టమన్నారు మంత్రి రోజా. సీఎం జగన్ తన సొంత చరిష్మాతో ఎమ్మెల్యేలందరినీ గెలిపించుకున్నారని.. వైఎస్సార్సీపీ నుంచి చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలను లాక్కునప్పుడు ఏం జరిగిందో అందరికి తెలుసన్నారు.
చంద్రబాబు వైస్రాయ్ హోటల్లో మొదలెట్టిపెట్టిన వెన్నుపోటు రాజకీయాన్ని ఇంకా నడిపిస్తున్నారని.. వెన్నుపోటు రాజకీయాలను ప్రజలు తరిమి కొట్టాలన్నారు. రాజకీయ భవిష్యత్తును ఇచ్చిన ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్న వ్యక్తి చంద్రబాబు.. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి విప్ జారీచేసి చేసే ఎమ్మెల్యేలను అమ్మి రాజకీయం చేశారని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను కొని వారిలో నలుగురిని మంత్రులు చేశారన్నారు.
వైఎస్ జగన్ 175 టార్గెట్ పెట్టుకున్నారు.. రాష్ట్రంలో ప్రజలు తమ వైపు ఉన్నారని.. 21ఎమ్మెల్సీల్లో వైఎస్సార్సీపీ 17, టీడీపీ నాలుగు మాత్రమే గెలిచిందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు.. ఆ తర్వాత ఆ రెండు సీట్లే చంద్రబాబుకు వస్తాయని.. ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీకి వస్తానంటూ భార్య పరువును పక్కనపెట్టి చంద్రబాబు అసెంబ్లీకి ఎలా వచ్చారని ప్రశ్నించారు.
స్పీకర్ను అవమానించి అసెంబ్లీని భ్రష్టుపట్టించారని.. రాజకీయం అంటే అసహ్యించుకునే పరిస్థితికి తెలుగుదేశం పార్టీ దిగజారిందన్నారు మంత్రి. వైఎస్సార్సీపీలో ఉండి టిడిపికి ఓటు వేసిన ఎమ్మెల్యేలకు భవిష్యత్తు ఉండదన్నారు. జగన్ను రాజకీయంగా మోసం చేసిన వారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని.. వైఎస్సార్సీపీలో సీట్లు రావని తెలిసే డబ్బుకు అమ్ముడుపోయి టీడీపీకి ఓటు వేశారన్నారు. డబ్బులు ముఖ్యం కాదు ప్రజలు అభిమానం పేరు ప్రతిష్టలు ముఖ్యమని.. టీడీపీకి ఓటు వేసిన వారు పొలిటికల్ గా సూసైడ్ చేసుకున్నట్లే అని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు వాపుని చూసి బలుపు అనుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు బండారు బయటపడుతుందని.. సార్వత్రిక ఎన్నికల్లో ప్రాథమిక ఓటు ఉండదు.. ఒకరికి ఒక ఓటే ఉంటుందన్నారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధిస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసిన ఎమ్మెల్యేలను గుర్తిస్తామని.. ఇది తమ పార్టీ అంతర్గత విషయమన్నారు. ఈ ఫలితాలపై అంతగా ఆలోచించాల్సిన పనిలేదన్నారు.. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలన్నారు.. ఇవే చివరి విజయోత్సవాలన్నారు కాకాణి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa