ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బోయ, వాల్మీకి కులాలను ఎస్టీల్లో చేర్చుతూ ఏపీ అసెంబ్లీలో తీర్మానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 24, 2023, 06:11 PM

ఏపీ అసెంబ్లీలో వైసీపీ సర్కార్ రెండు కీలక తీర్మానాలు ప్రవేశపెట్టారు. బోయ, వాల్మీకి కులాలను ఎస్టీల్లో చేర్చుతూ తీర్మానం చేశారు. అలాగే దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చాలని తీర్మానించారు. ఏకసభ్య కమిషన్‌ నివేదిక ఆధారంగా తీర్మానాలు చేశారు. అసెంబ్లీలో ఆమోదించిన రెండు తీర్మానాలను కేంద్రానికి పంపుతున్నామని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) వెల్లడించారు. ఈ తీర్మానాలపై సీఎం జగన్ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.


'ఈ రోజు సభలో రెండు తీర్మానాలకు సంబంధించి బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాం. ఈ తీర్మానాలను కేంద్రానికి పంపుతున్నాం. నా సుదీర్ఘ పాదయాత్ర సమయంలో తమకు అన్యాయం జరిగిందని, 70 ఏళ్లుగా ఎస్టీ హోదా కోసం పోరాటం చేస్తున్నామని, తమను ఎస్టీ జాబితాలో చేర్చాలనిబోయ, వాల్మీకి కులాలు విజ్ఞప్తి చేశారు. పక్క రాష్ట్రం కర్ణాటకలోని బళ్లారిలో తమ కులస్తులకు ఎస్టీ హోదా ఉందని, రాయలసీమ జిల్లాల్లో ఉన్న తమకు ఎస్టీ హోదా ఇవ్వలేదని వారు ఎన్నో దశాబ్ధాలుగా చెప్పుకుంటున్నారు' అని జగన్ వ్యాఖ్యానించారు.


'అధికారంలోకి మనం వచ్చిన వెంటనే వీరికి న్యాయం చేసే విధంగా.. ఎస్టీ స్టేటస్‌ రాష్ట్రం పరిధిలో లేకపోయినప్పటికీ మన చేతనైనంత చేయాల్సిన బాధ్యత, మానవత్వం ప్రతి మనిషిలో ఉండాలి. ఆ మానవత్వంలో భాగంగానే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ కూడా ఇచ్చాం. మనం వచ్చిన తరువాత వీరికి మంచి చేస్తామని మాటిచ్చాం. మేనిపెస్టోలో చెప్పిన ప్రకారం బోయ, వాల్మీకిల స్థితిగతులపై అధ్యాయనం చేయించడానికి మన ప్రభుత్వం వన్‌ మెన్‌ కమిషన్‌ను ఏర్పాటు చేశాం. రిటైర్డు ఐఏఎస్‌ అధికారి శ్యామూల్‌ ఆనంద్‌కుమార్‌ను నియమించాం' అని ముఖ్యమంత్రి జగన్ వివరించారు.


'ఈ కులస్థులు అధికంగా ఉండే రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, వైయస్‌ఆర్‌ జిల్లా, అనంతపురం జిల్లాల్లో ఈ కమిషన్‌ విస్తృతంగా పర్యటించి ఆ కుటుంబాలపై ఆధ్యాయనం చేసింది. వారి ఆర్థిక స్థితిగతులను పరిశీలించి నివేదిక తయారు చేశారు. ఈ నివేదిక ద్వారా కమిషన్‌ సిఫార్సు చేసింది. ఈ సిఫార్స్‌లను పరిగణలోకి తీసుకొని కేంద్రానికి సిఫార్స్‌ చేస్తూ అసెంబ్లీ ద్వారా పంపుతున్నాం. వీరికి ఎస్టీ హోదా కల్పించాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ద్వారా కొంత మంది షెడ్యూల్‌ ఏరియాల్లో దుష్ప్రచారం చేస్తున్నారు. షెడ్యూల్‌ ఏరియాల్లో ఉన్న వారికి ఊరట కలిగిస్తూ.. వారికి తెలియాల్సిన బాధ్యత ఈ సభపై ఉంది' అని సీఎం జగన్ స్పష్టం చేశారు.


'వన్‌ మెన్‌ కమిషన్‌ నివేదికలో.. మన రాష్ట్రం మొత్తం మీద 6 ఫార్మూలా, జోనింగ్‌ వ్యవస్థ రాష్ట్రంలో ఉండటంలో ఉద్యోగాలు, చదువులకు సంబంధించిన విషయాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఎస్టీలపై ఎలాంటి ప్రభావం ఈ నిర్ణయం వల్ల ఉండదు. ఆ ప్రాంతాలకు సంబంధించి అన్నీ కూడా వేరే జోన్‌లోకి వస్తాయి. ఇక్కడి ఉద్యోగాలకు, చదువులకు ఎటువంటి పరిస్థితిలోనూ ఉండదు. నాన్‌ జోనింగ్‌ ఉద్యోగాలపై మాత్రమే కొంత ప్రభావం ఉంటుంది. గ్రూప్‌ వన్‌ ఉద్యోగాలు.. గత పదేళ్లుగా కేవలం 386 ఉద్యోగాలు మాత్రమే గ్రూప్‌1లో నియమించారు. కేవలం 22 ఉద్యోగాల మీదే పోటీ ఉంటుంది. మిగిలిన వాటిలో ఎక్కడా కూడా పోటీ ఉండదు' అని జగన్ సభలో వివరించారు.


'ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న నా ఎస్టీ సోదరులందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. గిట్టని వారు కావాలనే, ఓట్ల కోసం అని ప్రలోభపెట్టి దుష్ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు వివరిస్తున్నాను. షెడ్యూల్‌ ఏరియాలో ఉన్న గిరిజనులు, ఆదివాసులకు ఎలాంటి భంగం వాటిల్లదని మీ జగనన్నగా హామీ ఇస్తున్నాను. ఒకరికి న్యాయం చేస్తున్నామంటే ఇంకొకరికి అన్యాయం చేస్తున్నట్లు కాదు. అన్యాయం చేయాలనే అభిప్రాయం, ఉద్దేశం కానీ మీ జగనన్నకు లేదు. నా రాజకీయ ప్రయాణం మొదలైన తరువాత ఎస్టీలు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. నా జీవితం చివరి వరకు కూడా వారిని అలాగే గుండెల్లో పెట్టుకుంటాను. ఇసుమంతా కూడా అన్యాయం చేయను' అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa