టిక్కెటు తీసుకోకుండా ప్రయాణించి అంతకంటే ఎక్కువ మొత్తంలో భారీ మూల్యం చెల్లించుకొంటున్న ఘటనలను మనం చూస్తున్నాం. అదే సందర్బంలో ఇలాంటి ప్రయాణాలే రైల్వేశాఖకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయటా...? టిక్కెట్టు లేకుండా ప్రయాణించే వారి వల్ల రైల్వేకు దండిగా ఆదాయం సమకూరుతోంది. టిక్కెట్ లేని ప్రయాణికుల విధిస్తోన్న జరిమానాలతో కోట్లాది రూపాయలు వసూలవుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో ఓ అధికారి ఏకంగా కోటి రుపాయల జరిమానాలు వసూలు చేశారు. విజయవాడ రైల్వే డివిజన్కు చెందిన ఎంజె.మాథ్యూ అనే చీఫ్ టిక్కెట్ ఇన్స్పెక్టర్ గుడివాడ స్క్వాడ్లో పనిచేస్తున్నారు. ఏడాది కాలంలో ఈయన రూ.1.02 కోట్ల జరిమానాలు వసూలు చేశారు.
ఎంజె.మాథ్యూ మొత్తం 12,707 కేసులు నమోదు చేశారు. 35ఏళ్ల కెరీర్లో మాథ్యూ జిఎం అవార్డుతో పాటు డిఆర్ఎం అవార్డు, ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ అవార్డులు పొందారు. అత్యధిక కేసులు నమోదు చేసిన అధికారికి జిఎం నుంచి అభినందనలు దక్కాయి.
ఇక, గతేడాది ఏప్రిల్ 1 నుంచి మార్చి 16 వరకూ తమ జోన్ పరిధిలోని ముగ్గురు అధికారులు ఒక్కొక్కరు రూ.కోటికిపైగా టిక్కెట్ లేని ప్రయాణికుల నుంచి జరిమానా రూపంలో వసూలు చేసినట్టు దక్షిణ రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. డిప్యూటీ చీఫ్ టిక్కెట్ ఇన్స్పెర్టర్ ఎస్ నంద కుమార్ 27,787 కేసులు నమోదుచేసి రూ.1.55 కోట్లు జరిమానా వసూలు చేశారు. ఇప్పటి వరకూ టిక్కెట్ చెకింగ్ స్టాఫ్ జరిమానా కింద వసూలు చేసిన అధిక మొత్తం ఇదే.
చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ రోసాలైన్ అరోకియా మేరీ కూడా జరిమానాల ద్వారా రూ.1.03 కోట్లు వసూలు చేసి భారతీయ రైల్వేలో పెనాల్టీ ద్వారా అత్యధికంగా వసూలు చేసిన మహిళా ఉద్యోగినిగా నిలిచారు. అలాగే, సీనియర్ టికెట్ ఎగ్జామినర్ శక్తివేల్ రూ.1.01 వసూలుచేసినట్టు దక్షిణ రైల్వే తెలిపింది. జరిమానాల విధించి అధిక మొత్తం వసూలు చేసిన దక్షిణ రైల్వే ఉద్యోగులను రైల్వే మంత్రిత్వశాఖ అభినందిస్తూ వారి ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేసింది. తన విధుల పట్ల నిబద్ధతను కనబరిచి, టిక్కెట్ తీసుకున్నవారికి ప్రయాణం సౌకర్యవంతంగా సాగేలా చేస్తున్నారని ప్రశంసించింది.
ఇదిలావుంటే ముంబైకి ఇలాంటి అంకితభావం ఉన్న ఆఫీసర్లు అవసరమని, ముఖ్యంగా ఫస్ట్క్లాస్ లేడీస్ కంపార్ట్మెంట్ కోసం అని నెటిజన్ వ్యాఖ్యానించాడు. టిక్కెట్ లేనివారు ఫస్ట్ క్లాస్లోకి ఎలా ప్రయాణిస్తారని అసహనం వ్యక్తం చేశారు. రోసలిన్ అరోకియా మేరీని ముంబైకి బదిలీ చేయమని అతడు అభ్యర్థించారు.
మరోవైపు, సికింద్రబాద్ రైల్వే డివిజన్లో కూడా మరో ఏడుగురు అధికారులు కోటికి పైగా జరిమానాలు వసూలు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేవలం తొమ్మిది మంది రైల్వే తనిఖీ సిబ్బంది ఏకంగా రూ.9.62 కోట్లు వసూలు చేశారు. సగటున ఒక్కొక్కరూ రూ.కోటిని మించి వసూలు చేశారన్నమాట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa