వేటపాలెం మండలంలో గత ఏడాది జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులపై గురువారం నాడు అధికారులు సామాజిక తనిఖీ నిర్వహించారు. జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ శంకర్ నాయక్ ఈ సందర్భంగా పనుల నిర్వహణ, నిధుల వ్యయంపై లోతుగా పరిశీలన జరిపారు. మండలంలోని కొన్ని గ్రామాలలో కూలీల హాజరు పట్టిలో దిద్దుబాట్లు ఉండడాన్ని గుర్తించారు. అలాగే బైపాస్ రోడ్డు నాటిన మొక్కలు ఎండిపోవటం కూడా ఆయన దృష్టికి వచ్చింది. ఈ విషయమై శంకర్ నాయక్ అధికారుల వివరణ కోరగా హాజరు వేసిన తర్వాత కొందరు కూలీలు పనులకు వచ్చినందువలన రికార్డుల్లో దిద్దుబాట్లు జరిగాయని చెప్పారు. కూలీలు అనారోగ్యం కారణంగా నీరు పట్టకపోవడంతో మొక్కలు ఎండిపోయాయని వివరణ ఇచ్చారు. మొక్కలు ఎండిపోయిన ఘటనకు సంబంధించి కూలీలకు వేతనాలు చెల్లించవద్దని, ఇకపై హాజరు పట్టీలో ఎలాంటి దిద్దుబాట్లు ఉండరాదని పి. డి శంకర్ నాయక్ ఆదేశించారు. మొత్తం మీద మండలంలో దాదాపు 8 కోట్ల రూపాయలతో ఉపాధి హామీ పథకం కింద పనులు సంతృప్తికరంగానే జరిగాయని ఆయన పేర్కొన్నారు. వేటపాలెం ఎమ్ డి ఓ శర్మ, జిల్లా వెలుగు శాఖ విజిలెన్స్ అధికారి శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa