మన దేశంలో కోవిడ్ వైరస్ చాపకింద నీరులా వేదంగా విస్తరిస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక రేటుతో మనదేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. చాలా దేశాల్లో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతుండగా.. భారత్ సహా కొన్ని ఆసియా దేశాల్లో కేసులు పెరుగుతుండటం గమనార్హం. దేశంలో శనివారం (ఏప్రిల్ 1) కొత్తగా 2,994 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 16,354కి ఎగబాకింది. దేశంలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 4.47 కోట్లు (4,47,18,781)కి చేరుకుంది. కోవిడ్ వైరస్ బారినపడి గడిచిన 24 గంటల్లో దేశంలో 9 మంది మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ శనివారం ఉదయం వెల్లడించింది.
దేశంలో కోవిడ్ కారణంగా మరణాల సంఖ్య 5,30,876కి చేరుకుంది. కోవిడ్ కారణంగా గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో ఇద్దరు, కర్ణాటకలో ఇద్దరు, పంజాబ్లో ఇద్దరు, కేరళలో ఇద్దరు, గుజరాత్లో ఒక్కరు మరణించారు. ప్రస్తుతం దేశంలో 0.04 శాతం క్రియాశీల (యాక్టివ్ కేసులు) ఉన్నాయి. కోవిడ్ -19 రికవరీ రేటు 98.77 శాతంగా ఉంది. దేశంలో నిన్న (మార్చి 31) కొత్తగా 3,095 కరోనా కేసులు నమోదయ్యాయి.
మరణాల రేటు 1.19 శాతంగా ఉండగా.. కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,71,551కి పెరిగింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 220.66 కోట్ల డోసుల కోవిడ్ -19 వ్యాక్సిన్ను పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఆగ్నేయాసియా ప్రాంతంలో ముఖ్యంగా భారత్లో.. కోవిడ్ -19 కొత్త కేసుల్లో అత్యధిక రేటు ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 27 నుంచి మార్చి 26 ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసులను పరిశీలించి ఈ వివరాలను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా, ఇదే కాలానికి చాలా దేశాల్లో కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పట్టగా.. ఆగ్నేయ ఆసియా ప్రాంతంలో కేసులు పెరిగాయని తెలిపింది.
‘ఆగ్నేయాసియా ప్రాంతంలో కొత్తగా 27,000 కేసులు నమోదయ్యాయి. ఇది మునుపటి 28 రోజుల వ్యవధితో పోలిస్తే 152% పెరుగుదల. డేటా అందుబాటులో ఉన్న ప్రాంతంలోని 11 దేశాలలో ఏడు దేశాల్లో కొత్త కేసులు 20% లేదా అంతకంటే ఎక్కువ పెరిగాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల్లో 64 శాతం కేసులు ఈ ఏడు దేశాల్లోనే ఉన్నాయి’ అని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa