నంద్యాలజిల్లా, అవుకు మండలం రామపురం గ్రామంలో ఈనెల 1వ తేదీన జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. పారిశ్రామికవేత్త మల్లు వెంకటేశ్వరరెడ్డి డ్రైవరే ఇంట్లో దొంగతనానికి పాల్పడినట్లు ఎస్పీ రఘువీర్రెడ్డి వెల్లడించారు. సోమవారం నంద్యాల ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కేసు వివరాలను ఎస్పీ వివరించారు. అవుకు మండలం రామపురం గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త మల్లు వెంకటేశ్వరెడ్డి కుటుంబంతో తిరుపతికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నాడు. తన డ్రైవర్ అయిన సూర్య చంద్రుడును తీసుకువెళ్లేందుకు కబురు పెట్టాడు. అప్పటి వరకు వస్తానని చెప్పిన సూర్యచంద్రుడు వాహనం బయలుదేరేముందు తాను రానని చెప్పి సెల్ స్వీచాఫ్ చేసుకున్నాడు. వెంకటేశ్వరరెడ్డి మరో డ్రైవర్తో కలిసి తన వాహనంలో తిరుపతికి వెళ్లాడు. 2వ తేదీ తెల్లవారుజామున ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో వెంకటేశ్వరరెడ్డి ఫ్యాక్టరీలో గుమాస్తాగా పనిచేస్తున్న వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే ఆయన తిరుపతి నుంచి వచ్చి ఇంటిని పరిశీలించాడు. చోరీ జరిగిందని అవుకు పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు విచారణలో నిందితులను పట్టుకున్నారు. డ్రైవర్ సూర్యచంద్రుడు అలియాస్ సూర్యతో పాటు అవుకు మండల కేంద్రానికి చెందిన పోతుల రామాంజనేయులు, లంకెల వన్నెప్పలను అదుపులోకి తీసుకొని విచారించారు. వారి వద్ద నుంచి 63 తులాల బంగారు నగలు, రూ.14లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వెంకటేశ్వరరెడ్డి ఇంట్లో బంగారు నగలు, నగదు ఉన్నట్లు గుర్తించిన డ్రైవర్ సూర్యచంద్రుడు పథకం ప్రకారం తన స్నేహితులతో కలిసి దొంగతనానికి పాల్పడినట్లు ఎస్పీ పేర్కొన్నారు. అదేవిధంగా మరో కేసులో నిందితుడుగా ఉన్న సూర్యచంద్రుడు చోరీ చేసిన ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. కేసును చేధించిన బనగానపల్లె సీఐ సుబ్బరాయుడు, అవుకు ఎస్ఐ జగదీశ్వరరెడ్డి, సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa