ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటయ్యే అవకాశం ఉందని డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర వెల్లడించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, పరిపాలనకు అనువుగా మరో జిల్లా ఏర్పాటుపై పరిశీలన జరుగుతోందన్నారు. గిరిజనులకు పాలన అందుబాటులో ఉండేందుకు సీఎం జగన్మోహన్రెడ్డి.. అరకు పార్లమెంటరీ నియోజకవర్గంలో రెండు జిల్లాలను ఏర్పాటు చేశారన్నారు. రానున్న కాలంలో మూడో జిల్లా కూడా రానుందని.. దీనిపై సీఎం జగన్ ఆలోచన చేస్తున్నారని చెప్పుకొచ్చారు. కొత్తగా ఏర్పడిన పార్వతీపురం మన్యం జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సహకారం వస్తోందని.. పూర్తిస్థాయిలో అభివృద్ధికి కొంత సమయం పడుతుందని వ్యాఖ్యానించారు.
పార్వతీపురం మన్యం జిల్లా ఆవిర్భావ వేడుకల్లో.. ఏడాది ప్రగతిని డిప్యూటీ సీఎం వివరించారు. జిల్లాకు సంబంధించి నూతన కలెక్టరేట్, వైద్య కళాశాల నిర్మాణానికి అవసరమైన భూములను గుర్తించామని.. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే పనులు ప్రారంభిస్తామన్నారు. జిల్లాకు రూ.600 కోట్లతో వైద్య కళాశాల మంజూరైన విషయాన్ని గుర్తు చేశారు. జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష కార్యక్రమం కింద 21,353 పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశామన్నారు.
జగన్ సర్కార్ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని.. రైతులకు ఖరీఫ్ సీజన్లో జిల్లాలోని 306 రైతు భరోసా కేంద్రాల ద్వారా 25,043 క్వింటాళ్ల విత్తనాలు అందించామన్నారు. వీరిలో 18966 మంది గిరిజనులకు 3101 క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేశారన్నారు. అలాగే రైతు భరోసా ద్వారా 1.34 లక్షల మంది రైతులకు రూ.185 కోట్లు చెల్లించామన్నారు. జిల్లా ఏర్పడి ఏడాది మాత్రమే అయ్యిందని.. దశల వారీగా జిల్లాను అభివృద్ధి చేస్తామన్నారు డిప్యూటీ సీఎం.
జిల్లా అభివృద్ధికి అందరూ కలిసి కృషి చేస్తున్నారన్నారు కలెక్టరు నిశాంత్కుమార్. ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రంలోనే మన్యం జిల్లా రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు. అలాగే జిల్లాలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు.. జాతీయ రహదారి 130 పీడీ పనులు రూ.550 కోట్ల జరుగుతున్నాయన్నారు. పార్వతీపురం స్టేషనులో 14 ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. అలాగే జిల్లాలో గిరిజన గ్రామాలలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరువ చేయాలనే ఉద్దేశంతో 4జీ కనెక్టివిటీ కోసం 180 టవర్ల నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. ఈ ఏడాది జూన్ తరువాత జిల్లాలో పూర్తిస్థాయిలో నెట్వర్క్ కనెక్టవిటీ అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
డిప్యూటీ సీఎం మాత్రమే కాదు.. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో అప్పటి మంత్రి పేర్ని నాని కూడా 27వ జిల్లా ఏర్పాటవుతుందని చెప్పారు. గిరిజన ప్రాంతాలను రెండు జిల్లాలుగా చేశారని.. మరో జిల్లా ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నట్లు అప్పట్లోనే చెప్పారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర కూడా ప్రస్తావించారు. ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa