ట్రెండింగ్
Epaper    English    தமிழ்

“జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం”కు వైసీపీ శ్రీకారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 07, 2023, 07:37 PM

రాష్ట్రవ్యాప్తంగా “జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం” కార్యక్రమానికి వైసీపీ  శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా జగనన్న రథసారధులు ప్రతీ ఇంటికీ వెళ్లి వైఎస్సార్‌సీపీ పాలనలో జరుగుతున్న మంచి గురించి అడిగి తెలుసుకుని, జగనన్న పాలనపై ప్రజా అభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో ‘జగనన్నే మా భవిష్యత్‌’ కార్యక్రమం ఈ నెల 20 వరకు వరకూ కొనసాగనుంది. సచివాలయానికి ముగ్గురు చొప్పున నియమించిన కన్వినర్లు.. ప్రతి 50 నుంచి వంద ఇళ్లకు ఇద్దరు చొప్పున నియమించిన గృహ సారథులు ఈ కార్యక్రమంలో మమేకం అవుతారు. మొత్తం ఏడు లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.


‘జగనన్నే మా భవిష్యత్‌’ కార్యక్రమం గురించి ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీలు అయోధ్య రామిరెడ్డి, సంజీవ్ కుమార్, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌లు వివరించారు. దేశ చరిత్రలోనే తొలిసారి పార్టీ కార్యకర్తలతో కోటి 80 లక్షల కుటుంబాలకు ఈ కార్యక్రమాన్ని తీసుకెళుతున్నామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సీఎం జగన్ ఆలోచనలు ఎలా అమలయ్యాయో ప్రజలతో వివరిస్తామన్నారు. పార్టీ కన్వీనర్లు, గృహ సారథులు ప్రతి ఇంటికి వెళ్లి.. గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి వివరిస్తారన్నారు.


దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తితో రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు.. జగన్ ఉంటేనే ఈ కార్యక్రమాలు జరుగుతాయని ప్రజలు భావిస్తున్నారన్నారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా.. ఆ నమ్మకాన్ని కొనసాగించడానికి 'జగన్‌తోనే మా భవిష్యత్‌' అనే కార్యక్రమంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా గ్రామంలో, పట్టణాల్లో ప్రారంభమైందని.. ఈ నెల 20 వరకు కొనసాగుతుందని తెలిపారు. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమాన్ని ఈ రెండు వారాల పాటూ ప్రజల్లోకి తీసుకెళతామన్నారు.


ప్రతి ఇంటికి పుస్తకం తీసుకెళ్లి.. రాష్ట్రం, దేశ చరిత్రలో ఇలాంటి కార్యక్రమం ఎప్పుడూ జరగలేదని వివరిస్తామన్నారు. తాము తీసుకెళ్లే బుక్‌లెట్‌లో ఒక పేజీలో గత ప్రభుత్వ పాలనో జరిగిన కార్యక్రమాలు.. మరో పేజీలో ఈ నాలుగేళ్ల పాలనో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో పథకం రావాలంటే జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సి వచ్చే పరిస్థితులు ఉండేవని.. కానీ ఇప్పుడు అలాంటి అవసరమే లేదన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసి.. సంక్షేమం ఇదే అని చెప్పడం గర్వంగా ఉందన్నారు. లంచాలకు తావులేకుండా ప్రతి పథకం లబ్దిదారులకు అందుతోందని.. అందుకే ధైర్యంగా ప్రజల్లోకి వెళుతున్నామన్నారు.


ఐదు అంశాలతో ఓ పుస్తకం ఉంటుంని.. ప్రతి కుటుంబానికి మంచి జరిగిందా లేదా.. గత ప్రభుత్వంతో పోలిస్తే మంచి జరిగిందా లేదా వివరిస్తామన్నారు. చంద్రబాబు ప్రజల్లోకి ఇలా వెళ్లే ధైర్యం ఉందా.. చంద్రబాబు తెచ్చిన అప్పులకు వడ్డీ కడుతూనే.. కోవిడ్ వంటి కష్టకాలంలో కూడా సంక్షేమాన్ని అమలు చేస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత టీడీపీ పార్టీ బోర్డు తిప్పేయడమేనని.. టీడీపీ విమర్శల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే సలహాలను కూడా స్వీకరిస్తామని.. ఈ ప్రభుత్వానికి 5కోట్ల ప్రజల సంక్షేమమే ముఖ్యమన్నారు.


భారతదేశ చరిత్రలోనే తొలిసారి ఇలా ఓ రాజకీయ పార్టీ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు ఎంపీ అయోధ్య రామిరెడ్డి. మేనిఫెస్టో ద్వారా చెప్పిన హామీల్ని నెరవేర్చి.. ఏం చెప్పామో, ఏం చేశామో ప్రజలకు చెప్పడానికి వెళుతున్నామన్నారు. ఈ నాలుగేళ్లలో పార్టీ చెప్పిన ప్రతి మాట నెరవేర్చామా లేదా అన్నది వివరిస్తామని.. దేశంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం జరగలేదన్నారు. ప్రభుత్వం చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళుతున్నామని.. భవిష్యత్‌ ప్రణాళికను తయారు చేసుకోవడానికి పునాది.. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నామన్నారు.


ప్రభుత్వం నాలుగేళ్లగా ఎన్నో సంక్షేమ అందించింది కాబట్టి ధైర్యంగా ప్రజల్లోకి వెళుతున్నామన్నారు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. మొన్నటి వరకు గడప, గపడకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చేసిన మంచిని వివరించామని.. పార్టీలు, కులాలకు అతీతంగా ప్రభుత్వం చేసిన మంచి వలనే ధైర్యంగా ప్రతి ఇంటికి వెళ్లగలుగుతున్నామన్నారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల పేరుతో పథకాల విషయంలో ప్రజల్ని ఇబ్బంది పెట్టారని.. కానీ ఈ ప్రభుత్వం అర్హత ఉంటేనే పథకాలు అందాయననారు.


ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ప్రశ్నలు ఇచ్చి సమాధానం తీసుకుంటామన్నారు. స్టిక్కర్ అంటించి అభిప్రాయం తీసుకుంటామని.. మళ్లీ ఈ నెల 20 తర్వాత ఈ సర్వే ఫలితాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. ప్రజలకు మంచి చేశాం కాబట్టి ధైర్యంగా వెళుతున్నామన్నారు. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలతో ప్రజలు నమ్మకంగా ఉన్నారని.. అందుకే మా నమ్మకం నువ్వే జగనన్న అంటూ ముందుకు సాగుతున్నామన్నారు. గ్రామం నుంచి నగరం వరకు ప్రతి కార్యకర్త ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.


ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజా మద్దతు పుస్తకం ద్వారా ప్రజల్లోకి వెళుతున్నారు. ప్రధానంగా ఐదు ప్రశ్నల్ని ప్రజల ముందు ఉంచుతారు. 'గత పాలనతో పోలిస్తే జగన్ పరిపాలనలో మీకు, మీ కుటుంబానికి మంచి జరిగిందా' లేదా అన్నది తెలుసుకుంటారు. ప్రతి ఇంటి ఇద్దరు గృహ సారథులు, వాలంటీరు వెళతారు. గత ప్రభుత్వం, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాలను వివరిస్తారు.. వారికి కరపత్రాన్ని చదివి వినిపించి వారికే అందజేస్తారు. ప్రజా మద్దతు పుస్తకంలో ప్రజా సర్వేకు సంబంధించి ఐదు ప్రశ్నలు ఉన్న స్లిప్పుపై.. ఆ కుటుంబ పెద్ద పేరు, ఫోన్‌ నంబర్‌ నమోదు చేస్తారు. వారి నుంచి సమాధానాలు నమోదు చేస్తారు. స్లిప్పుపై ఉన్న రసీదును ఆ కుటుంబానికి ఇస్తారు. అలాగే ఈ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన వారిని 82960–­82960 నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వాలిని కోరతారు. ఈ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన వారి ఇంటి తలుపునకు సీఎం వైఎస్‌ జగన్‌ ఫొటోతో కూడిన స్టిక్కర్‌ అతికించేందుకు అనుమతి కోరతారు. సమ్మతించిన వారి ఇంటి తలుపునకు స్టిక్కర్‌ అతికిస్తారు.. అలాగే మొబైల్‌ ఫోన్‌కు స్టిక్కర్‌ అతికించి ధన్యవాదాలు తెలుపుతారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa