ఏపీలో వైసీపీ సర్కార్ వర్సెస్ ఏపీ ఎన్జీవోస్ మధ్య గత కొంతకాలంగా వార్ సాగుతున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులను నిర్లక్ష్యం చేస్తున్నారని.. సమయానికి జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ సర్కారు ఉందని ఏపీ జేఏసీ- అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు. ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టి ప్రభుత్వం నాలుగు స్తంభాలాట ఆడుతోందని తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. కేవలం ఉద్యోగులకే ప్రభుత్వం రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తోందా? అని ప్రశ్నించారు. గ్రామ, వార్డు వాలంటీర్లు, ప్రభుత్వ సలహాదారుల కోసం రూ. 20 వేల కోట్లు ఖర్చు చేస్తున్న మాటను ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు.
రాష్ట్రంలో సర్వీసు రూల్స్ కూడా సరిగా అమలు చేయడం లేదని.. పొరుగు రాష్ట్రాల్లో ఉద్యోగుల పరిస్థితి బాగుందని బొప్పరాజు వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. ఉద్యోగులకు ఒకటో తారీఖునే వేతనాలు, పెన్షన్లు, 11వ పీఆర్సీ వేతన స్కేలు అమలు చేయడం, పీఆర్సీ అరియర్స్, పెండింగ్ డీఏలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మరోవైపు సమస్యల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని కూడళ్లలో మలివిడత పోరాటానికి దిగారు. నల్ల కండువాలు, ప్లకార్డులతో విజయవాడలో ఆందోళనలో పాల్గొన్న బొప్పరాజు వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పేస్కేలు దగ్గర నుంచి డీఏ అరియర్స్, పీఆర్సీ, చివరికి జీతాలు ఇవ్వమంటేనే అవహేళన చేసే వరకు పరిస్థితి వచ్చిందని వాపోయారు. అన్ని అంశాలను నాలుగేళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించట్లేదని ఆరోపించారు. సమస్యల పరిష్కారం సంగతి దేవుడెరుగు కనీసం లెక్కలు చెప్పండయ్యా అంటే.. తాము ఉద్యమం మొదలు పెట్టిన తర్వాత డబ్బులు ఇచ్చామంటున్నారని తప్పుబట్టారు. ఎంత ఇచ్చారని అడిగితే దానికి సమాధానం చెప్పట్లేదని.. అందుకే ఉద్యమాన్ని మళ్లీ ప్రారంభించామని వెల్లడించారు.
ఇక, ఉద్యోగులను కించపరిచేలా మంత్రులు తలొక మాట మాట్లాడుతున్నారని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఒకరేమో ఎప్పుడైతే ఏంటి జీతం ఇస్తున్నాం కదా అంటారని.. మరొకరేమో రూ. 90 వేల కోట్లు మొత్తం ఉద్యోగుల కోసమే ధారపోస్తున్నామంటారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఏ చర్చల్లోనైనా తాము ఇవ్వాల్సింది ఇస్తాం.. చెప్పాల్సింది చెప్పేసి వెళ్లిపోతాం అనే ధోరణితో మాట్లాడుతున్నారు తప్ప సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఉద్యోగుల సమస్యల్ని నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పోస్టర్ల విడుదలతో మొదలైన మలి దశ ఉద్యమం సమీప భవిష్యత్తులో తీవ్రరూపం దాల్చుతుందని వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ యాప్ వినియోగాన్ని నిలిపి వేస్తూ సెల్ ఫోన్ డౌన్ చేస్తామని బొప్పరాజు తేల్చి చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa